సిటీబ్యూరో, డిసెంబర్ 1 (నమస్తే తెలంగాణ): గ్రేటర్ ప్రజల జీవన ప్రమాణాలపై ఈజ్ ఆఫ్ లివింగ్, సిటీజన్ పర్సెప్షన్ సర్వే -2022లో నగర పౌరులు ప్రతి ఒక్కరూ పాల్గొని హైదరాబాద్ నగరాన్ని ముందంజలో ఉంచాలని జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్కుమార్ తెలిపారు. దేశవ్యాప్తంగా ఉన్న ఆకర్షణీయ (స్మార్ట్ సిటీ) కార్యక్రమంలో భాగంగా కేంద్ర హౌసింగ్, పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖ నిర్ణయం మేరకు ఈజ్ ఆఫ్ లివింగ్పై 10 లక్షలు జనాభా పైబడిన నగరాల్లో సర్వే నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు. ఇంటి అద్దె, ప్రజా రవాణ, ఇతరత్రా అంశాలపై మొత్తం 17 ముఖ్య పౌర సేవల సదుపాయాల గురించి కేంద్ర హౌసింగ్, పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖ రూపొందించిన ప్రశ్నలకు పౌరులు సమాధానాలు ఇవ్వాల్సి ఉంటుందన్నారు. జీవన ప్రమాణాలపై నవంబర్ 9వ తేదీన సర్వే ప్రక్రియ ప్రారంభం కాగా.. ఈ నెల 23 వరకు దాదాపు 45 రోజుల పాటు ప్రజాభిప్రాయ సేకరణ జరుగుతుందన్నారు. నగరంలో ప్రజల జీవన ప్రమాణాలపై దేశవ్యాప్తంగా ఈజ్ ఆఫ్ లివింగ్, ‘సిటిజన్ పర్సెప్షన్- 2022’లో నగర వాసులు పాల్గొని గ్రేటర్ హైదరాబాద్ నగరాన్ని మరోసారి ముందంజలో ఉంచాలని జీహెచ్ఎంసీ కమిషనర్ పిలుపునిచ్చారు.
సంబంధిత క్యూర్ ( QR )కోడ్ ద్వారా, యూఆర్ఎల్ ద్వారా సర్వేలో పాల్గొనాలి. 8 భాషల్లో సర్వే నిర్వహిస్తున్నారు. తెలుగు, హిందీ, ఇంగ్లిష్, కన్నడ, తమిళ్, మలయాళం, మరాఠీ, గుజరాత్ భాషల్లో ప్రశ్న పత్రాలు ఉన్నాయి. రాష్ట్రం, తెలంగాణ, హైదరాబాద్ నగరం పేరు తప్పని సరిగా ఎంచుకోవాలని అధికారులు సూచించారు.
సర్వేలో పలు అంశాలను ప్రాతిపదికగా తీసుకుంటారు. పనిదినాల్లో రోడ్లపై ప్రయాణానికి పట్టే సమయం, ప్రజా రవాణ సదుపాయం, కొత్తగా వచ్చే వలసలు, అన్ని కులాలు, మతాలు కలిసి నివసించే వైవిధ్యం, అందుబాటులో ఇండ్లు, ఆహార సదుపాయాలు, సూల్స్, ఆసుపత్రులు లాంటి మౌలిక సదుపాయాలు, పచ్చదనం, పరిశుభ్రమైన గాలి, మున్సిపాలిటీ ఆర్థిక స్థోమత అంశాలు తీసుకుంటారు. అంతేకాకుండా రాజకీయ-సామాజిక వాతావరణం, రాజకీయ-సాంస్కృతిక , వైద్య ఆరోగ్య సేవల లభ్యత, విద్యావకాశాలు, పౌర సేవలు, రవాణా, వినోదం, వినియోగ వస్తువులు, గృహ నిర్మాణం, సహజ వాతావరణం తదితర అంశాల ఆధారంగా సర్వే జరుగనున్నది.
Step 1: Enter Url : \https://eol2022.org/
Step 2: Click on Take Survey
Step 3: Enter Citizen Details
Step 4: Select State as Telangana and Select City as Hyderabad
Step 4: Click on proceed
Step 5: Enter responses for all 17 questions and submit
నగర ప్రజలు సర్వేలో అధిక సంఖ్యలో పాల్గొని జీవన సౌలభ్యం (ease of living)లో ఉత్తమ ర్యాంకు వచ్చే విధంగా కృషి చేయాలని పౌరులకు జీహెచ్ఎంసీ పిలుపునిచ్చింది.