సిటిజన్స్ దవాఖాన వైద్యుల ఘనత
శేరిలింగంపల్లి, మే 31: పరిశ్రమలో పనిచేస్తున్న ఓ కార్మికుడి చేతి మణికట్టు తెగిపడింది. నలగండ్ల సిటిజన్స్ ఆస్పత్రిలో అతడికి ఆర్థోపెడిక్ వైద్య బృందం అరుదైన శస్త్ర చికిత్సను చేసి అతికించారు. సిటిజన్స్ ఆస్పత్రి సీనియర్ ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ అశోక్రాజు గొట్టిముక్కల నేతృత్వంలో వైద్య బృందం ఈ ఘనతను సాధించింది. మంగళవారం ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఈ శస్త్ర చికిత్సకు సంబంధించిన వివరాలను వైద్యులు వెల్లడించారు. పటాన్చెరువులోని ఇస్నాపూర్ పారిశ్రామిక వాడలోని ఓ జ్యూస్ కంపెనీలో యంత్రం వద్ద విధులు నిర్వర్తిస్తున్న 22 ఏండ్ల హరీశ్ ప్రమాదానికి గురయ్యాడు. ఈ ప్రమాదంలో హరీశ్ కుడిచేతి మణికట్టు దగ్గర నుంచి పూర్తిగా తెగి పోయింది.
చికిత్స నిమిత్తం హరీశ్ను నలగండ్లలోని సిటిజన్స్ ఆస్పత్రికి తరలించారు. దవాఖాన ఆర్థోపెడిక్ డాక్టర్ అశోక్రాజు గొట్టిముక్కల నేతృత్వంలో హరీశ్కు దాదాపు 8 గంటల పాటు శస్త్ర చికిత్స చేశారు. తెగిపడిన చేతిని విజయవంతంగా అతికించారు. హరీశ్ సరైన సమయంలో సిటిజన్స్ వైద్యులను సంప్రదించాడని, వైద్యుల సూచనల మేరకు తెగి పడిన చేతిని ప్రత్యేకంగా ఐస్ ప్యాక్లో భద్రపరిచి తోటి కార్మికులు తీసుకువచ్చారని వైద్యులు తెలిపారు. పారిశ్రమల్లో జరిగే ప్రమాదాలు, రోడ్డు ప్రమాదాల్లో కాళ్లు, చేతులు, వేళ్లు కోల్పోయిన వారు ఆలస్యం చేయకుండా వైద్యులను సంప్రదిస్తే మెరుగైన సేవలందించే వీలుంటుందని తెలిపారు. సిటిజన్స్ దవాఖాన చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ డాక్టర్ ప్రభాకర్ పలచర్ల, ఆర్థోపెడిక్ వైద్యులు వాసుదేవ జువ్వాడి, కిలారు ప్రపుల్, ప్లాస్టిక్ సర్జన్లు వెంకటేశ్ బాబు, శశిధర్ రెడ్డితో పాటు కార్మికుడు హరీశ్ కూడా ఈ మీడియా సమావేశంలో పాల్గొన్నారు.