కొండాపూర్ : పురిటి నొప్పులతో బాధపడుతున్న మహిళను 108 అంబులెన్స్లో దవాఖానకు తరలిస్తుండగా మార్గమధ్యలోనే ప్రసవించిన సంఘటన గచ్చిబౌలిలో చోటు చేసుకుంది. అంబులెన్స్ ఈఎంటీ జాహిద్ తెలిపిన వివరాల ప్రకారం… గచ్చిబౌలిలోని టీఎన్జీఓస్ కాలనీలో నివాసం ఉండే సునంద(20), బుధవారం ఉదయం పురిటి నొప్పులు వస్తుండడంతో 108కు సమాచారం అందించారు.
వెంటనే అక్కడికి చేరుకున్న సిబ్బంది ఆమెను కొండాపూర్లోని రంగారెడ్డి జిల్లా దవాఖానకు తరలిస్తుండగా గచ్చిబౌలి సమీపంలోకి రాగానే నొప్పులు ఎక్కువవ్వడంతో ఈఎంటీ జాహిద్ అంబులెన్స్ డ్రైవర్ ప్రణయ్ సహకారంతో ప్రసవం చేశారు. సునంద మగబిడ్డకు జన్మనివ్వగా, తల్లీ బిడ్డలు క్షేమంగా ఉన్నారని, మెరుగైన వైద్యం కోసం జిల్లా దవాఖానకు తరలించినట్లు తెలిపారు. కాగా సునందకు ఇది రెండవ కాన్పు.