హైదరాబాద్ : ఆపదలో ఉన్న బాలల రక్షణ కోసమే బాల రక్షక్ వాహనాల ఏర్పాటు చేశామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. శుక్రవారం వెస్ట్ మారేడ్ పల్లిలోని తన నివాసం వద్ద రెండు బాల రక్షక్ వాహనాలను ప్రారంభించి మాట్లాడారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఆపదలో ఉన్న బాలల కోసం తెలంగాణ ప్రభుత్వం 1098 హెల్ప్ లైన్, జిల్లాకు ఒకటి చొప్పున బాలరాక్షక్ వాహనాలను ఏర్పాటు చేసిందన్నారు.
హైదరాబాద్ జిల్లాకు రెండు వాహనాలను కేటాయించిందన్నారు.
అనాథ బాలలు, భిక్షాటన చేస్తూ 18 సంవత్సరాల లోపు పిల్లలు ఎక్కడ కనిపించినా, బాల్య వివాహం జరుగుతున్నా కానీ 1098 హెల్ప్ లైన్ కు కాల్ చేస్తే బాల రక్షక్ వాహనం అక్కడికి సకాలంలో చేరుకొంటుందన్నారు.
హెల్ప్ లైన్ కు కాల్ వచ్చిన వెంటనే సంఘటనా స్థలానికి ప్రొటెక్షన్ ఆఫీసర్, జిల్లా బాలల సంరక్షణ యూనిట్ అధికారులు బాల రక్షక్ వాహనంతో చేరుకుంటారన్నారు. పరిస్థితులను బట్టి పోలీసు, రెవెన్యూ తదితర శాఖల అధికారుల సహకారం తీసుకోకుంటారని మంత్రి వెల్లడించారు.
మహిళా శిశుసంక్షేమ శాఖ పర్యవేక్షణలో బాల రక్షక్ వాహనాలు పని చేస్తాయన్నారు. బాల రక్షక్ వాహనం ద్వారా తీసుకొచ్చిన బాలల సంరక్షణ కోసం బాల సదన్లో చేర్పిస్తామని మంత్రి తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహిళలు, బాలికల సంరక్షణ కోసం అనేక చర్యలు తీసుకుంటుందన్నారు.