సిటీబ్యూరో, ఏప్రిల్ 8 (నమస్తే తెలంగాణ) : గ్రేటర్లో భూగర్భజలాలు తగ్గడంతోనే ట్యాంకర్ వాటర్కు డిమాండ్ ఏర్పడిందని, గతేడాది కంటే ఈ సారి మొదటి మూడు నెలల్లోనే 10వేల మంది వినియోగదారులు ట్యాంకర్ నీటిపై ఆధారపడుతున్నట్లు సర్వేలో తేలిందని పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి ఎం.దానకిశోర్ తెలిపారు. గత సంవత్సరంలో సగటు ట్యాంకర్ ద్వారా నీటి సరఫరా 12గా ఉంటే ఈ ఏడాది 20కి పెరిగిందన్నారు. కొండాపూర్, మాదాపూర్, శేరిలింగంపల్లి, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, ఖైరతాబాద్, షేక్పేట, మణికొండ ఏరియాల్లో మల్టీస్టోరేజ్ బిల్డింగ్లతో భూగర్భ జలాలు అడుగంటిపోయి 31వేలకు పైగా వినియోగదారులు వాటర్ ట్యాంకర్లపై ఆధారపడ్డారని, దాదాపు 1700 ప్రాంతాల్లో జలమండలి సర్వే నిర్వహించిందని దానకిశోర్ తెలిపారు.
నగరంలో చాలా ప్రాంతాల్లో 50 నుంచి 60 మీటర్ల లోతుల్లో భూగర్భజలాలు ఒట్టిపోయాయని, ఈ ప్రాంతాలలో తరచూ వాటర్ ట్యాంకర్ కోరుకునే వినియోగదారులకు ఇంటికి జలమండలి, ఎన్జీవో సంస్థలు వెళ్లి వీరంతా ఇంకుడు గుంతల నిర్మాణం తప్పనిసరిగా ఏర్పాటు చేసుకునేలా చర్యలు చేపడతామని తెలిపారు. ఇంకుడు గుంతలు లేని వారికి రూఫ్ టాప్ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ఏర్పాటు చేసుకోవాలని చెప్పారు. గ్రేటర్లో తాగునీటి సరఫరా పరిస్థితిపై పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి ఎం.దానకిశోర్ సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఖైరతాబాద్లోని ప్రధాన కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ఈ సమావేశానికి జలమండలి ఎండీ సుదర్శన్రెడ్డి, రవాణాశాఖ కమిషనర్ జ్యోతి బుద్దప్రకాశ్, జాయింట్ కమిషనర్ రమేశ్, జలమండలి డైరెక్టర్లు డాక్టర్ ఎం.సత్యనారాయణ, అజ్మీరా కృష్ణ, వీఎల్ ప్రవీణ్కుమార్, స్వామి పాల్గొన్నారు. 705 ట్యాంకర్ల ద్వారా 24 గంటల పాటు ట్యాంకర్ నీటిని అందిస్తున్నామని., రాబోయే రోజుల్లో అదనంగా 300 ట్యాంకర్లను సమకూర్చుతామని దానకిశోర్ తెలిపారు. ట్యాంకర్ బుక్ చేసిన 12 గంటల్లోపే డెలివరీ చేసేందుకు ప్రయత్నం చేస్తామని చెప్పారు.
నాగార్జున సాగర్ నీటి నిల్వలు వేగంగా తగ్గుముఖం పడుతున్నాయని, 2017 సంవత్సర అనుభవాన్ని దృష్టిలో ఉంచుకొని రూ.4కోట్లతో ఎమర్జెన్సీ పంపింగ్ ఏర్పాట్లు చేశామని దానకిశోర్ తెలిపారు. ఈ నెల 15వ తేదీ నుంచి మొదటగా ఒక పంపుతో ఎమర్జెన్సీ పంపింగ్ ప్రారంభిస్తామన్నారు. సాగర్ డేడ్స్టోరేజీలో ఉన్నప్పటికీ కొత్తగా ఈ సారి బార్జ్ టెక్నాలజీని ఉపయోగించి వర్షాభావ పరిస్థితులున్నా కృష్ణా జలాలను ఏడాది పొడవునా ఎమర్జెన్సీ పంపింగ్ ద్వారా ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.
ఎల్లంపల్లిలో ఉన్న నిల్వలు మూడు నెలల వరకు ఢోకా లేదని, మే 1నుంచి అత్యవసర పంపింగ్ ద్వారా నగరానికి నీళ్లు ఇస్తామన్నారు. సింగూరు, మంజీరా, ఉస్మాన్సాగర్, హిమాయత్సాగర్లో పుష్కలంగా నీరు ఉన్నదని, ఈ రిజర్వాయర్ల నుంచి అదనంగా 15 ఎంజీల మేర నీరు సరఫరా చేసేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. బెంగళూరులో 40శాతం మేర నీటి డిమాండ్ పెరిగితే నగరంలో4.2 శాతం మాత్రమే ఉందన్నారు. ఈ వేసవి ముగిసే వరకు జలమండలి యంత్రాంగం, డైరెక్టర్లు అప్రమత్తంగా ఉండి నీటి కొరతను అధిగమించే చర్యలు తీసుకోవాలని సూచించారు.