సిటీబ్యూరో, అక్టోబర్ 5 (నమస్తే తెలంగాణ) / జూబ్లీహిల్స్ : ముఖ్యమంత్రి అల్పాహార పథకం’ ప్రభుత్వ పాఠశాలల్లో నేటి నుంచి అమలు కానుంది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఈ పథకాన్ని శుక్రవారం వెస్ట్ మారేడుపల్లిలోని ప్రభుత్వ పాఠశాలలో మంత్రి కేటీఆర్ ప్రారంభించ నున్నారు. ఉప్పల్లోని ఇండస్ట్రియల్ ఏరియా మోడ్రన్ బేకరీ సమీపంలో హోంమంత్రి మహమూద్ అలీ, జీహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్ రాస్తో కలిసి మన్నా ట్రస్ట్ ప్రాంగణంలో అల్పాహారం సరఫరా వాహనాలను జెండా ఊపి ప్రారంభిస్తారు.
అలాగే ధరంకరమ్ రోడ్డులోని ప్రభుత్వ పాఠశాలలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రారంభించనున్నారు. ఈ పథకంతో హైదరాబాద్ జిల్లాలోని 868 ప్రభుత్వ,ఎయిడెడ్ పాఠశాలల్లోని 1,46, 086 మంది విద్యార్థులు లబ్ధి పొందనున్నారు. గ్రేటర్లోని 15 నియోజకవర్గాల్లోని ఒక స్కూల్లో స్థానిక ఎమ్మెల్యేలు పథకాన్ని ప్రారంభించనున్నారు.
పథకం ప్రాధాన్యతలు..
మేడ్చల్, అక్టోబర్5(నమస్తే తెలంగాణ): సీఎం అల్పాహార పథకాన్ని నేడు మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా వ్యాప్తంగా ప్రారంభించనున్నారు. మేడిపల్లిలోని జడ్పీ ఉన్నత పాఠశాలలో అల్పాహార పథకాన్ని మంత్రి మల్లారెడ్డి ప్రారంభించనున్నారు. 509 ప్రభుత్వ పాఠశాలల్లో చదివే 90 వేల మంది విద్యార్థులు లబ్ధి పొందనున్నారు. స్థానిక ఎమ్మెల్యేలు ఒక్కో స్కూలులో ప్రారంభించనున్నారు.