మేడ్చల్, అక్టోబర్16 (నమస్తే తెలంగాణ): మేడ్చల్లో ఈ నెల 18న నిర్వహించే ముఖ్యమంత్రి కేసీఆర్ బహిరంగ సభకు ఏర్పాట్లు చేస్తున్నారు. గుండ్లపోచంపల్లి సమీపంలో 50 ఎకరాల విస్తీర్ణంలో బహిరంగ సభను నిర్వహిస్తున్నారు. ఈ సభకు మేడ్చల్ నియోజకవర్గం నుంచి 70 వేల పైచిలుకు జనసమీకరణ చేసేలా మంత్రి మల్లారెడ్డి ప్రణాళిక చేశారు. బహిరంగ సభస్థలి వద్ద వేదికను సిద్ధం చేస్తున్నారు. మైదానాన్ని చదను చేసి బహిరంగ సభకు వచ్చే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని సౌకర్యాలను కల్పించేలా చూస్తున్నారు.
నియోజకవర్గం నుంచి భారీగా..
ముఖ్యమంత్రి బహిరంగ సభకు ప్రజలను భారీ సంఖ్యలో తరలించే విధంగా మంత్రి మల్లారెడ్డి నియోజకవర్గ ముఖ్య నేతలతో సమావేశమయ్యారు. మండలాలతో పాటు మున్సిపాలిటీ పరిధిలోని ప్రజాప్రతినిధులు, ముఖ్యనాయకులు, కార్యకర్తలతో సమావేశాలు నిర్వహించి జనసమీకరణపై ప్రణాళికను సిద్ధం చేసుకున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ బహిరంగసభను విజయవంతం చేసేలా 70 వేల పైచిలుకు జనసమీకరణ చేస్తున్నారు.
వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్దే విజయం: మంత్రి మల్లారెడ్డి
రానున్న శాసనసభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీదే విజయమని మంత్రి మల్లారెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి సభ స్థలి ఏర్పాట్లను సోమవారం మంత్రి మల్లారెడ్డి నాయకులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలో బీఆర్ఎస్ పార్టీ గెలుపొంది హ్యాట్రిక్ సాధిస్తుందన్నారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీలకు డిపాజిట్లు గల్లంతు ఖావడం ఖాయమన్నారు. ఓట్ల కోసం వచ్చే బీజేపీ, కాంగ్రెస్ పార్టీల అభ్యర్థులను ప్రజలు తరిమి కొడతారన్నారు.