“తెలంగాణను మునగగొట్టింది.. ప్రాజెక్టులు కట్టకుండా బంద్ చేసింది.. సాగు నీళ్లు రాకుండా చేసింది.. సింగరేణి లాంటి కంపెనీలను ముంచింది.. కాంగ్రెస్ పార్టీనే.. అప్పులు కట్టలేదని రైతుల ఇండ్ల తలుపులు.. బావుల కాడి మోటార్లను ఎత్తుకుపోయిన చరిత్ర ఆ పార్టీది.”. అని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. మంగళవారం చెన్నూరు నియోజకవర్గం అభ్యర్థి బాల్క సుమన్, మంథని నియోజకవర్గం అభ్యర్థి పుట్ట మధుకు మద్దతుగా నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలకు ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరై ప్రసంగించారు. “సింగరేణిని ఎవడమ్మిండు.? పరిపాలన చేతగాక కేంద్రం దగ్గర అప్పులు తెచ్చి.. తిరిగి కట్టలేక సింగరేణిలో కేంద్రానికి వాటాను కట్టబెట్టింది.. కాంగ్రెస్ పార్టీ కాదా..?
ఇంతచేసి ఇప్పుడు ఫోజులు కొట్టడానికి కాంగ్రెస్ పార్టీకి సిగ్గుండాలె.” రైతుల ముఖాలు ఇప్పుడిప్పుడే తెల్లబడుతున్నయ్.. గడ్డకుపడే పరిస్థితి వస్తున్నది.. కానీ, కాంగ్రెస్ పార్టీ 24 గంటల కరెంటు, రైతు బంధు, ధరణి పోర్టల్ వద్దంటూ.. గొడ్డలి భుజం మీద పెట్టుకుని బయల్దేరింది జాగ్రత్తా. తియ్యగ.. పుల్లగ మాట్లాడితే నమ్మి గోల్మాల్ కావద్దు. ఆలోచించకుండా ఆగమాగమై ఓటేస్తే.. ఈ ఐదేండ్లు పెద్ద దెబ్బ తగిలే అవకాశం ఉంది. ఆనాడు రైతులను ముంచిన కాంగ్రెస్ దొంగలకు ఓట్లు కాదు.. డిపాజిట్లు కూడా రావొద్దు. సూట్కేసులు పట్టుకొని వచ్చే వారిని నమ్మకండి.. సూట్కేస్గాళ్లు కావాల్నా.. పనికోసం తపన పడే వారు కావాల్నా.. ఆలోచించి కారు గుర్తుకు ఓటువేయాలి.
వర్షాలు, వరదలు వస్తే చెన్నూరు నియోజకవర్గంలోని గ్రామాలకు రాకపోకలు బందయ్యేవి. 22 బ్రిడ్జిలు కట్టించాం. ఇంకో 20 కడుతున్నాం. ఇవన్నీ పూర్తయితే ఎలాంటి సమస్యలు ఉండవు. వెయ్యి కోట్లు మంజూరు చేసి మంథని నియోజకవర్గాన్ని తీర్చిదిద్దే బాధ్యత నాది. బీఆర్ఎస్ వచ్చినంకనే రింగ్ రోడ్డును పూర్తిచేసినం. అనేక గ్రామాలకు వందల కిలోమీటర్లు రోడ్లు చేసుకున్నాం.