నాంపల్లి కోర్టులు, మే 5 (నమస్తే తెలంగాణ) : ఈ నెల 10న జరుగనున్న జాతీయ లోక్ అదాలత్ను విజయవంతం చేయాలని చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ దుర్గాప్రసాద్ పోలీసు అధికారులకు సూచించారు. జాతీయ లోక్ అదాలత్ గురించి ప్రజలకు అవగాహన కల్పించాలని ఆయన కోరారు. హైదరాబాద్ మెట్రోపాలిటన్ న్యాయసేవాధికార సంస్థ చైర్మన్, జిల్లా జడ్జి ప్రేమావతి ఆదేశాల మేరకు పోలీసు అధికారులతో శనివారం నాంపల్లి క్రిమినల్ కోర్టు ప్రధాన హాలులో ప్రత్యేక సమావేశమయ్యారు. రాజీకి ఆమోదయోగ్యమైన కేసులను పరిష్కరించేందుకు తగు చర్యలు చేపట్టాలని తెలిపారు. అధిక సంఖ్యలో కేసులను తొలగించే విధంగా కక్షిదారులను ప్రోత్సహించాలన్నారు. వివాహ సంబంధ, చెక్ బౌన్స్, రాజీ కుదుర్చుకునే ఐపీసీ సెక్షన్ల కింద నమోదైన కేసులు, రోడ్డు ప్రమాద, ఎక్సైజ్ తదితర కేసులను పరిశీలించి కక్షిదారులకు కౌన్సెలింగ్ చేయాలని వివరించారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ల సలహాలు, సూచనలు పాటించాలని తెలిపారు. కక్షిదారులకు కోర్టుల చుట్టూ తిరిగే అవశ్యకత ఉండదని, పోలీసు అధికారులు చొరవ తీసుకోవాలని కోరారు. నాంపల్లి కోర్టుల న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి, 16వ అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ రాధిక జైస్వాల్ పర్యవేక్షణలో ఈ సమావేశం నిర్వహించారు.