రూ.300 దాటిన చికెన్ ధర
వామ్మో అంటున్న కొనుగోలుదారులు
వారానికోసారి ఎగబాకుతున్న రేట్లు
వేసవి, నిర్వహణ వ్యయం పెరగడమే కారణం
సిటీబ్యూరో, మే 15( నమస్తే తెలంగాణ ): ఆదివారంపూట చికెన్ తెచ్చుకోవాలంటే సామాన్యుడు బెంబేలెత్తాల్సిన పరిస్థితి ఉంది. కారణం కోడి మాంసం ధరలు కొండెక్కాయి. రికార్డు స్థాయిలో కేజీ ధర రూ.310కి చేరింది. ఐదు నెలల కిందట కిలో చికెన్ రూ. 80 నుంచి రూ. 120 మధ్యలో ఉండగా.. ఇప్పుడు ఏకంగా త్రిబుల్సెంచరీ దాటడం గమనార్హం. కేజీ సరిపోతుందనుకునే కుటుంబం.. ఇప్పుడు అంత ధర పెట్టి కొనలేక.. ఇటు తినకుండా ఉండలేక అరకేజీ, పావుకేజీతో సరిపెట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చిందని వినియోగదారులు చెబుతున్నారు. ఇప్పటికే నిత్యావసర సరుకుల ధరలు పెరిగి ఇబ్బందులు ఎదుర్కొంటున్న సామాన్యులకు కొండెక్కిన కోడి ధరలు మరింత ఇబ్బందికి గురి చేస్తున్నాయి. ఇక బోన్లెస్ చికెన్కు కిలో రూ. 500 వరకు విక్రయిస్తుండటం విశేషం.
నాటు.. నాటు నాటు..
నాటుకోడి. దీనికి ఉండే క్రేజ్ వేరు. పల్లెల్లో పెరిగిన నాటుకోళ్లకు రెట్టింపు డిమాండ్. చాలా మంది నాటుకోడి మాంసాన్ని తినడానికి పోటీ పడుతుంటారు. కారణం రుచి ఎక్కువగా ఉండటం.. వాటి లభ్యత అంతంత మాత్రమే ఉండటం. నాటు కోడి ధర ఇప్పుడు మటన్తో పోటీపడుతుంది. కిలో నాటుకోడి ధర రూ.480 నుంచి రూ. 600 మధ్యలో పలుకుతోంది. ముఖ్యంగా ఆదిలాబాద్, ఖమ్మం, కరీంనగర్, వరంగల్ ఉమ్మడి జిల్లాల నుంచి నాటుకోళ్లు నగరానికి తీసుకొచ్చి అమ్ముతుంటారు. వీటితో పాటు మధ్యప్రదేశ్ నుంచి కడక్నాథ్ కోళ్లను తెచ్చి ఇక్కడి ఫారాల్లో పెంచుతున్నారు. కాగా, ఎండల వల్ల వాటి సరఫరా తగ్గడంతో నాటుకోడి ధరలు పెరిగాయని వ్యాపారులు చెబుతున్నారు.