బంజారాహిల్స్, డిసెంబర్ 31: రోజురోజుకూ పెరిగిపోతున్న ట్రాఫిక్ ఇబ్బందులను తొలగించేందుకు 2022లో ట్రాఫిక్ పోలీసులు చేపట్టిన చర్యలు మంచి ఫలితాలు ఇచ్చాయి. నగరంలోనే అత్యంత రద్దీ కలిగిన ప్రాంతాలైన బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ ట్రాఫిక్ పోలీస్స్టేషన్ పరిధిలో 2022 సంవత్సరంలో అనేక మార్పులు తీసుకువచ్చారు. దీనికితోడు ట్రాఫిక్ ఉల్లంఘనలపై ఉక్కుపాదం మోపుతూ జరిమానాలు విధించారు. ట్రాఫిక్ సమస్యలు అత్యధికంగా ఉన్న జూబ్లీహిల్స్ రోడ్ నం 45, రోడ్ నం 1తో పాటు బంజారాహిల్స్ రోడ్ నం 12, జూబ్లీహిల్స్ రోడ్ నం 92 ప్రధాన రహదారులపై రద్దీని తగ్గించేందుకు ఏడాది చివర్లో చేపట్టిన ప్రయోగాలతో అద్భుతమైన ఫలితాలు లభిస్తున్నాయి.
గతంలో ఒక్కో సిగ్నల్ దాటేందుకు సుమారు 15 నుంచి 20 నిమిషాల సమయం పట్టేచోట ట్రాఫిక్ అధికారులు చేసిన మార్పు చేర్పులతో ప్రయాణ సమయం మరింతగా తగ్గిపోయింది. అక్టోబర్ మొదటి వారం నుంచి ‘ఆపరేషన్ రోప్’కార్యక్రమంలో భాగంగా ప్రధాన కూడళ్ల వద్ద ‘ఫ్రీ లెఫ్ట్’ల విధానం అమలు చేయడంతో వాహనాలు సాఫీగా ముందుకు సాగుతున్నాయి. బంజారాహిల్స్లోని కేబీఆర్ పార్కు. జూబ్లీహిల్స్ చెక్పోస్ట్ ప్రాం తాల్లో గతంతో పోలిస్తే ట్రాఫిక్ సాఫీగా సాగుతోందని వాహనదారులు అభిప్రాయపడుతున్నారు. జూబ్లీహిల్స్ రోడ్ నం 45 జంక్షన్ వద్ద రైట్ టర్న్ తీసేయడంపై ప్రారంభంలో కొంత వ్యతిరేకత వచ్చినా పదిరోజుల తర్వాత ఈ ప్రయోగం సఫలం అయింది. నిత్యం ట్రాఫిక్ ఇబ్బందు లు ఉండే తాజ్మహాల్ హోటల్ నుంచి సీవీఆర్ జంక్షన్, రోడ్ నెం 45 జంక్షన్లలో ట్రాఫిక్ సాఫీగా సాగుతోండడంపై వాహనదారులు సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.
ఉల్లంఘనులపై జరిమానాల కొరడా..
ఒకవైపు ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు అనేక రకాలైన చర్యలు తీసుకున్న ట్రాఫిక్ పోలీసులు నిబంధనలు ఉల్లంఘించేవారిపై జరిమానాల కొరడా ఝలిపించారు. ట్రిపుల్ రైడింగ్, రాంగ్రూట్ ప్రయాణం, హెల్మెట్ లేని ప్రయాణం, సిగ్నల్ జంపింగ్స్ చేస్తున్న వాహనాలపై జరిమానాలు విధించారు. దీనికి తోడు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలలో గత ఏడాదితో పోలిస్తే మరిన్ని ఎక్కువ కేసులు నమోదయయ్యాయి. ఒకటికంటే ఎక్కువసార్లు డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుబడిన వారికి జైలుశిక్షలు పడ్డాయి. మొత్తం మీదం 2022లో ట్రాఫిక్ పోలీసుల పనితీరుకు మంచి మార్కులే పడ్డాయని చెప్పవచ్చు.