హైదరాబాద్, మార్చి 2 (నమస్తే తెలంగాణ) : పెరుగుతున్న పట్టణీకరణకు అనుగుణంగా ప్రతి పౌరుడు ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని డీజీపీ అంజనీకుమార్ కోరారు. గురువారం తన కార్యాలయంలో రిటైర్డ్ పోలీస్ అధికారి పి.తిరుపతిరెడ్డి రచించిన ‘ట్రాఫిక్ యాక్సిడెంట్స్ – ఇన్వెస్టిగేషన్’ అనే పుస్తకాన్ని జాతీయ పోలీస్ అకాడమీ మాజీ డైరెక్టర్ కమల్ కుమార్తో కలిసి ఆవిష్కరించారు.
ఈ సంరదర్భంగా డీజీపీ అంజనీకుమార్ మాట్లాడుతూ దేశంలోని వివిధ నగరాలతో పోల్చితే హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ నియంత్రణలో ఉన్నదని, అందుకే విదేశీ కంపెనీలు పెట్టుబడులు పెట్టేందుకు నగరానికి వస్తున్నాయని తెలిపారు. సమాజంలోని ప్రతి వ్యక్తి స్వీయ నియంత్రణకు పాల్పడినప్పుడే మెరుగైన ట్రాఫిక్ విధానాల అమలవుతాయని డీజీపీ అభిప్రాయపడ్డారు. తిరుపతి రెడ్డి రాసిన పుస్తకం తెలంగాణ పోలీస్ అధికారులకు కరదీపికగా పనిచేస్తుందని ప్రశంసించారు.
నేషనల్ పోలీస్ అకాడమీ రిటైర్డ్ డైరెక్టర్ కమల్ కుమార్ మాట్లాడుతూ దేశంలో ప్రతియేటా నాలుగున్నర లక్షల మంది రోడ్డు ప్రమాదాలకు గురైతే.. సుమారు లక్ష మంది మరణిస్తున్నారని వెల్లడించారు. ప్రమాదాలకు గురైన వారు కేవలం బీమా మొత్తాన్ని పొందేందుకు ప్రాధాన్యత ఇస్తున్నారు కానీ, ప్రమాదానికి కారకులైన వారికి శిక్ష పడే విషయంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సరైన శిక్ష పడినప్పుడే రోడ్డు ప్రమాదాలు తగ్గుతాయని అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా తిరుపతిరెడ్డిని ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ డీజీలు శివధర్ రెడ్డి, శ్రీనివాసరెడ్డి, అభిలాష బిస్త్, సంజయ్ కుమార్ జైన్, తదితర సీనియర్ పోలీస్ అధికారులు పాల్గొన్నారు.