సిటీబ్యూరో, డిసెంబర్ 2(నమస్తే తెలంగాణ): అప్పు కావాలా… అంటూ.. రుణ సంస్థలు, వివిధ బ్యాంకుల నకిలీ వెబ్సైట్లను సృష్టించి.. నిండా ముంచుతున్న ఢిల్లీకి చెందిన ముఠాను గురువారం సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర వెల్లడించిన వివరాల ప్రకారం..ఢిల్లీకి చెందిన అభిషేక్ మిశ్రా, రాజేంద్ర కుమార్, బ్రిజేష్కుమార్లు కలిసి పలు పేరొందిన రుణాలు ఇచ్చే బ్యాంక్లు, సంస్థల వెబ్ సైట్లను అక్షరం తేడాతో మార్చి నకిలీవి సృష్టిస్తున్నారు. నోయిడాలోని మారుమూల ప్రదేశంలో ఓ కాల్ సెంటర్ను నెలకొల్పి..అక్కడి నుంచి ఫోన్లు చేసి.. రుణం ఇస్తామని గాలం వేస్తున్నారు. లక్షల్లో రుణం మంజూరైందని ఆశపెట్టి జీఎస్టీ, ప్రాసెసింగ్, ఇలా అనేక విషయాలను పేర్కొని..బాధితుల నుంచి లక్షలు కొట్టేస్తున్నారు. ఆ తర్వాత ఫోన్లను స్విచ్ఛాప్ చేసేస్తున్నారు.
ముఠాపై 27 కేసులు..
దేశవ్యాప్తంగా ఈ ముఠా పై 27 కేసులు ఉండగా, సైబరాబాద్ పరిధిలో 9, పలు జిల్లాల్లో 5, మిగతా రాష్ర్టాల్లో 13 కేసులు నమోదయ్యాయి. ప్రధాన సూత్రధారి అభిషేక్ మిశ్రా పరారీలో ఉండగా, రాజేంద్రకుమార్తో పాటు మరో 13 మందిని పోలీసులు అరెస్టు చేశారు.
ఆ కేసు దర్యాప్తు చేపట్టి..
సైబరాబాద్ పరిధిలో నివాసముంటున్న బాధితుడు అక్టోబర్ 17న గూగుల్లో సెర్చ్ చేసి.. ధని లోన్ బజార్లో రుణం కోసం తన వివరాలతో దరఖాస్తు చేసుకున్నాడు. వెంటనే అతడికి దీపక్ శర్మ పేరుతో గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ చేసి.. ‘మీకు 5 లక్షల రుణం మంజురైందని, వివిధ చార్జీలంటూ.. రూ. 2.17 లక్షలు తస్కరించాడు. ఈ కేసు దర్యాప్తు చేపట్టిన పోలీసులు సాంకేతిక ఆధారాలు సేకరించి.. నోయిడాలో నిర్వహిస్తున్న కాల్ సెంటర్పై దాడి చేసి.. ఈ ముఠా గుట్టును
బయటపెట్టారు.
అక్షరం తేడాతో..
ఈ గ్యాంగ్ www.dhanibazaarloan.in, www.theloanindia.in పేర్లతో నకిటీ సైట్లను రూపొందించినట్లు పోలీసులు వెల్లడించారు. అసలు వెబ్సైట్లకు సంబంధించిన వాటిలో ఓ అక్షరం తేడా ఉన్నట్లు దర్యాప్తులో వెల్లడైంది. ది లోన్ ఇండియా, ధని లోన్ బజార్, పైసా లోన్ హబ్, ముద్రా లోన్ ఫినాన్స్ పేరుతో వెబ్సైట్లను తయారు చేసినట్లు గుర్తించారు.