Cyber Crime Preventation Tips | సిటీబ్యూరో, ఏప్రిల్ 18 (నమస్తే తెలంగాణ) : ఒక వ్యాపారంలో పెట్టిన పెట్టుబడిపై 2 శాతం వడ్డీతో లాభాలొస్తున్నాయంటే అది నమ్మశక్యంగా ఉంటుంది.. అలా కాకుండా పెట్టిన పెట్టుబడిపై మొదటి నెల నుంచే 5 నుంచి 50 శాతం లాభాలొస్తాయంటూ ఎవరైనా చెప్పారంటే అది పక్కా మోసం.. కాని సాఫ్ట్వేర్ ఇంజినీర్లు, ప్రైవేట్ ఉద్యోగులు, ఇంజినీరింగ్, పీజీలు చేసిన గృహిణులు అత్యాశకు పోయి కోట్ల రూపాయలు పోగొట్టుకుంటున్నారు. రెండు మూడేండ్లుగా సైబర్నేరగాళ్లు ఉద్యోగాలు, పార్ట్టైమ్ ఉద్యోగాల పేరుతో మెసేజ్లు పెట్టి మోసాలకు పాల్పడుతున్నాడు. రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ప్రతి రోజు ఇలాంటి మోసాల బారిన పడుతున్న వారు 6 నుంచి 8 మంది ఉంటుండగా.., ట్రై పోలీస్ కమిషనరేట్ల పరిధిలో 20 వరకు ఉంటున్నారు. వీరంతా సైబర్నేరగాళ్ల చేతిలో చిక్కి ఒక్కొక్కరు రూ.2 లక్షల నుంచి రూ. 50 లక్షల వరకు మోసపోతున్నారు. అత్యాశకు పోయి అప్పులు తెచ్చి పెట్టుబడులు పెట్టి నిండుగా మునుగుతున్నారు.
రాచకొండలో ఇటీవల నమోదైన కేసులు
ఉప్పల్కు చెందిన యువకుడు సివిల్ ఇంజినీర్. హోటల్ రూమ్స్ రివ్యూకు సంబంధించిన జాబ్ ఉన్నదంటూ ప్రియా అనే పేరుతో టెలిగ్రామ్లో మెసేజ్ వచ్చింది. పార్ట్టైమ్ ఉద్యోగం అనే ఉద్దేశ్యంతో బాధితుడు సరే అన్నారు. దీంతో సైబర్నేరగాళ్లు ఒక లింక్ను పంపించి, యాప్ను డౌన్లోడ్ చేయించారు. అందులో కొన్ని రివ్యూలకు సంబంధించిన వాటికి ఓకే చెప్పడంతో గంట వ్యవధిలోనే వెయ్యి రూపాయలు వచ్చాయి. ఇదేదో బాగుందనే నమ్మకం బాధితుడిలో వచ్చింది. రెండో రోజు రూ.10 వేలు పెట్టుబడి పెడితే మీకు ఎక్కువగా లాభాలొస్తాయంటూ నమ్మించారు. దీంతో రూ. 10 వేలు పెట్టుబడి పెట్టడంతో అదే రోజు రూ.4 వేలు లాభం వచ్చింది. ఆ మొత్తాన్ని డ్రా చేసుకున్నాడు. తరువాత మరింత పెట్టుబడి పెడితే లాభాలు ఎక్కువగా ఉంటాయంటూ టెలిగ్రామ్ నుంచి మెసేజ్లు, ఫోన్లు రావడంతో బాధితుడు 13 దఫాలుగా రూ.22,84,601 పెట్టుబడి పెట్టాడు. కానీ లాభాలు కనిపిస్తున్నా.. డ్రా చేసుకొనే వీలు లేకుండా పోయింది. దీంతో బాధితుడు మోసపోయానని పోలీసులను ఆశ్రయించాడు.
నెరెడ్మెట్కు చెందిన ఓ యువతి ప్రైవేట్ ఉద్యోగి. పార్ట్టైమ్ ఉద్యోగమని, యూట్యూబ్ వీడియోలు లైక్ చేస్తే మీకు డబ్బులు వస్తాయంటూ నమ్మించారు. ఆ తరువాత టెలిగ్రామ్ యాప్లోకి తీసుకెళ్లి కొంత పెట్టుబడి పెడితే మీకు లాభాలొస్తాయంటూ ఓ యాప్ను డౌన్లోడ్ చేయించి దఫ దఫాలుగా రూ.5.82 లక్షలు పెట్టుబడి పెట్టాంచి మోసం చేశారు.
ఉప్పల్కు చెందిన ఓ వ్యక్తి సాప్ట్వేర్ ఇంజినీర్కు పార్ట్ టైమ్ జాబ్ ఉన్నదని, అమేజాన్ ఫ్లాట్ ఫామ్లో ఆర్డర్లను క్లిక్ చేయడమే పని అంటూ అందులో పేర్కొంటూ అమేజా09 పేరుతో ఓ లింక్ను పంపించారు. అందులో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని, దానికి బ్యాంకు ఖాతాను జతచేయాలంటూ సూచించారు. అందులో బాధితుడు ముందుగా కొంత చెల్లిస్తే అందుకు తగ్గట్టుగా టార్గెట్లు ఇస్తామని చెప్పారు. దీనికి బాధితుడు రూ.200 జమ చేసి వాళ్లిచ్చిన టాస్క్లు పూర్తి చేసి కొద్దిసేపట్లో రూ.260 తిరిగి పొందాడు. టెలిగ్రామ్లో మరో వ్యక్తి మెసేజ్ పెడుతూ ఎక్కువ పెట్బుడి పెడితే ఎక్కువ లాభాలొస్తాయంటూ నమ్మిస్తూ 12 దఫాలుగా రూ.18, 11,500 పెట్టుబడి పెట్టించి లూటీ చేశారు.
అల్మాస్గూడకు చెందిన ఓ సాఫ్ట్వేర్ ఇంజినీర్కు పార్ట్టైమ్ జాబ్ పేరుతో మెసేజ్ వచ్చింది. అందులో మూవీ టిక్కెట్లకు సంబంధించి రేటింగ్పై క్లిక్ చేయాలని, అందుకు సంబంధించి ఫిలిమ్ ర్యాంకింగ్సిస్.కామ్ పేరుతో ఓ వైబ్సైట్ను పంపించారు. దాంట్లో రిజిస్టార్ చేసుకోవాలని సూచించారు. బాధితుడు 30 టిక్కెట్లకు సంబంధించిన రేటింగ్ ఇవ్వడంతో రూ.906 బాధితుడి ఖాతాలో డిపాజిట్ అయ్యాయి. ఆ తరువాత ఎక్కువ మొత్తంలో పెట్టుబడిపెడితే లాభాలొస్తాయంటూ నమ్మించి 20 దఫాలుగా రూ.35,83, 140 డిపాజిట్ చేసి మోసపోయాడు.
లక్షలు ఎలా వస్తున్నాయి..
చేస్తున్న ఉద్యోగంలో వచ్చే జీతం సరిపోకపోవడంతోనే పార్ట్టైమ్ ఉద్యోగంపై దృష్టి పెడుతున్నారు. అయితే సైబర్నేరగాళ్లు బాధితుల స్థోమతను వారి ఆలోచనను గుర్తిస్తూ ఉచ్చులోకి దింపుతున్నారు. దీంతో టెలిగ్రామ్లో సైబర్నేరగాళ్ల మాటలు నమ్మి బాధితులు మోసపోతున్నారు. తాను ప్రస్తుతం పార్ట్టైమ్లో వ్యాపారం చేస్తున్నానని, ఒకటి రెండు నెలల్లో మీకు రెట్టింపు డబ్బు ఇస్తానంటూ నమ్మిస్తూ బంధువులు, స్నేహితుల, ఇంట్లోని వస్తువులను అమ్మేసి అత్యాశకు పోయి సైబర్నేరగాళ్లు చెప్పే పార్ట్టైమ్, పెట్టుబడి వ్యాపారాలలో పెట్టుబడి పెట్టి మోసపోతున్నారు.
తాజాగా రూ.28 లక్షలు
హైదరాబాద్ సైబర్ క్రైంలో మంగళవారం రెండు వేర్వేరు ఘటనల్లో ఇదే తరహాలో రూ.28 లక్షలు పోగొట్టుకున్న బాధితులు ఫిర్యాదు చేయడంతో కేసులు నమోదయ్యాయి.
ఆ మెసేజ్లు క్లిక్ చేయవద్దు
గుర్తుతెలియని వ్యక్తుల నుంచి పార్ట్టైమ్ ఉద్యోగాల పేరుతో వచ్చే మెసేజ్లు పట్టించుకోవద్దు. చదువుకున్న వాళ్లే ఈజీగా సైబర్నేరగాళ్ల బుట్టలో పడుతున్నారు. కష్టపడకుండా డబ్బు రాదు, ఈజీగా డబ్బు సంపాదించాలనే ఆలోచనను మానుకోవాలి. ఒక మెసేజ్ వచ్చిందంటే ఆ మెసేజ్ నిజమా..? అబద్దమా..? అనే విషయాన్ని స్నేహితులు, బంధువుల వద్ద చర్చించండి. దీంతో పాటు పనిచేసే కార్యాలయాలలో తోటి వారితోనూ చర్చించండి. సైబర్నేరాలపై తెలంగాణ పోలీసులు నిరంతరం ప్రజలను అప్రమత్తం చేస్తూ వస్తున్నారు.
– అనురాధ, డీసీపీ సైబర్క్రైమ్స్, రాచకొండ కమిషనరేట్