Insurance | సిటీబ్యూరో, ఫిబ్రవరి 16 (నమస్తే తెలంగాణ): బీమా పేరుతో మోసాలకు పాల్పడుతున్న నకిలీ ఇన్సూరెన్స్ ఏజెంట్లను రాచకొండ సైబర్క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. సైబర్క్రైమ్స్ డీసీపీ అనురాధ కథనం ప్రకారం.. రిటైర్డు ఉద్యోగికి గుర్తుతెలియని వ్యక్తుల నుంచి ఓ ఫోన్కాల్ వచ్చింది. తాము ఇన్సూరెన్స్ ఏజెంట్లమని, మా వద్ద మీరు పాలసీ తీసుకుంటే భారీ లాభాలు ఉంటాయంటూ నమ్మించారు. బాధితుడితోపాటు మరో 12 మందికి ఈ విధంగానే కాల్ చేశారు. రూ.2 కోట్ల నుంచి రూ.4 కోట్ల వరకు రిటర్న్స్ వస్తాయంటూ నమ్మించారు. 2016 నుంచి 2022 మధ్య కాలంలో బాధితుల నుంచి రూ. 1.60 కోట్లు సైబర్ నేరగాళ్లు లూటీ చేశారు. దీనిపై బాధితులు రాచకొండ సైబర్క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో.. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.
కాల్సెంటర్ ముసుగులో..
ఉత్తర్ప్రదేశ్ ఘజియాబాద్కు చెందిన ముర్షిద్ అన్సారీ అలియాస్ రిహాన్, వికాస్ సింగ్, తరుణ్ శర్మ, మనీశ్ టాగూర్ సింగ్, లలిత్కుమార్ కాల్సెంటర్ ఏర్పాటు చేశారు. గతంలో పాలసీలు చేసి మధ్యలో ఆపేసిన వారి, ప్రస్తుతం పాలసీల ప్రీమియం చెల్లిస్తున్న వారికి సంబంధించిన డాటాను సేకరించారు. వాళ్లకు ఫోన్చేసి.. మీ పాలసీపై భారీ లాభాలు ఉన్నాయి.. మేము చెప్పినట్లు చేస్తే మీకు ఊహించని డబ్బు వస్తుంది.. అంటూ నమ్మించారు. భారీ డబ్బులు మీ ఖాతాలో జమవుతాయని చెప్పారు. అయితే, వాటికి సంబంధించి 18 శాతం జీఎస్టీ చెల్లించాలంటూ.. దఫ దఫాలుగా మోసాలు చేస్తూ అందినకాడికి దోచేశారు. ఏసీపీ వెంకటేశం నేతృత్వంలో ఇన్స్పెక్టర్ బి.రాజు బృందం దర్యాప్తు జరిపి నిందితులు ఘజియాబాద్కు చెందిన వారుగా గుర్తించారు. ఐదుగురు నిందితులను అరెస్ట్ చేశారు. ఈ ముఠా నుంచి 7 ఫోన్లు, 14 సిమ్ కార్డులు, ల్యాప్టాప్, రూ. 1.5 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు.