చార్మినార్, మే 27 : తెలంగాణ రాష్ర్టానికి ప్రత్యేక చిహ్నంగా చార్మినార్ నిలుస్తున్నదని యూఎస్ రాయబారి ఎరిక్ గార్సెట్టి అభిప్రాయపడ్డారు. నగర పర్యటనలో భాగంగా ఆయన శనివారం చార్మినార్ పరిసర ప్రాంతాల్లో పర్యటించారు. 500 ఏండ్లుగా నగర చిహ్నంగా అంతర్జాతీయ ఖ్యాతి గడించిన చార్మినార్ను చూడగానే తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. నాటి కళావైభవాన్ని ప్రశంసించారు. నగర చరిత్రలో భాగమైన చార్మినార్ చుట్టూ ప్రదేశాలు ఎంతో చారిత్రాత్మకమైనవని పేర్కొన్నారు. నగర చరిత్రలో ఇమిడిపోయిన ఇరానీ చాయ్ రుచి చూసి.. వాహ్ అంటూ కితాబిచ్చారు. అమెరికా రాయబారితో దక్షిణ మండల డీసీపీ సాయిచైతన్య ముచ్చటిస్తూ నగర వైవిధ్యాన్ని పరిచయం చేశారు. అనంతరం నిమ్రా కేఫ్ యజమాని అమెరికా రాయబారి ఎరిక్ గార్సెట్టికి చార్మినార్ జ్ఞాపికను బహూకరించారు.