చార్మినార్/సుల్తాన్బజార్/మెహిదీపట్నం/చాంద్రాయణగుట్ట/ కార్వాన్/ జియాగూడ/ఆబిడ్స్, డిసెంబర్ 23: వైకుంఠ(ముక్కోటి) ఏకాదశిని పురస్కరించుకుని గోషామహల్, కార్వాన్, నాంపల్లి నియోజకవర్గాల పరిధిలోని పలు ఆలయాల్లో శనివారం ప్రత్యేక పూజలు నిర్వ హించారు. పాతనగరంలోని వైష్ణవ దేవాలయాలు తెల్లవారుజాము నుంచే భక్తుల సందడి మొదలైంది. గౌలిపుర కోదండరామస్వామి ఆలయం, సర్దార్ మహల్ సమీపంలోని చౌక్ మైదాన్ వేంకటేశ్వరస్వామి, చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారి దేవాలయంలోనూ కదశి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. కోదండరామస్వామి, వేంకటేశ్వరస్వామి ఆలయంలో భక్తులకు ఉత్తరద్వార దర్శనం కల్పించిన నిర్వాహకులు అనంతరం తీర్థప్రసాదాలు అందజేశారు. మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్తోపాటు దక్షిణ మండల డీసీపీ సాయిచైతన్య తదితరులు భాగ్యలక్ష్మి అమ్మవారు,వేంకటేశ్వరస్వామి వారిని దర్శించుకున్నారు.
వైకుంఠ ఏకాదశికి సుల్తాన్బజార్, విజయనగర్ కాలనీల పరిధిలోని దేవాలయాలు ముస్తాబయ్యాయి. వేంకటేశ్వర స్వామి ఆలయాల్లో భక్తులు ఉత్తర ద్వార దర్శనం చేసుకునేలా నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు. రాంకోఠిలోని శ్రీసీతారామాంజనేయ స్వామి ఆలయం, దేవునికుంట వేంకటేశ్వరస్వామి, విజయనగర్ కాలనీ హనుమాన్ దేవాలయాల్లో భక్తుల రద్దీ కొనసాగింది. రాంకోఠిలోని సీతారామాంజనేయ స్వామి ఆలయంలో మహేశ్ బ్యాంక్ చైర్మన్ రమేశ్కుమార్ బంగ్, ఆలయ ట్రస్టీలు ప్రత్యేక పూజలు చేశారు.
వైకుంఠ ఏకాదశిని కార్వాన్, నాంపల్లి నియోజకవర్గాలలో శనివారం ప్రజలు భక్తిశ్రద్ధలతోజరుపుకున్నారు.లంగర్హౌస్, నానల్నగర్, గుడిమల్కాపూర్ ప్రాంతాల్లోని వేంకటేశ్వరస్వామి, రామాలయాల్లో ఉత్తర ద్వార దర్శనం ఏర్పాటు చేయడంతో భక్తులు పెద్దఎత్తున ఆలయాలకు తరలివచ్చి పూజలు చేశారు. లంగర్హౌస్ సంగం రామాలయంలో బీఆర్ఎస్ కార్వాన్ ఇన్చార్జి ఠాకూర్జీవన్సింగ్ పూజలు చేశారు. మెహిదీపట్నం దేవునికుంట వేంకటేశ్వర స్వామి ఆలయంలో ఎమ్మెల్సీ ఎంఎస్ ప్రభాకర్రావు, ఆలయ కమిటీ చైర్పర్సన్ ఎంఎస్ ఉషాప్రభాకర్రావు తదితరులు పూజలు చేశారు.
ముక్కోటి ఏకాదశి సందర్భంగా శనివారం పాతబస్తీలోని పలు ఆలయాల్లో భక్తులు పెద్ద సంఖ్యలో స్వామివారలను ఉత్తర ద్వార దర్శ నం చేసుకున్నారు. రక్షాపురం వేంకటేశ్వరస్వామి ఆలయం, ఉమామ హేశ్వరస్వామి, లాల్దర్వాజ వేంకటేశ్వరస్వామి, గౌలిపుర కోదండ రామస్వామి, చాంద్రాయణగుట్ట లక్ష్మీచెన్నకేశవస్వామి ఆలయాలను భక్తులు అధిక సంఖ్యలో దర్శించుకున్నారు.
వైకుంఠ ఏకాదశి సందర్భంగా శనివారం కార్వాన్,గుడిమల్కాపూర్ డివిజన్లలోని ఆలయాల్లో ప్రజలు భక్తిశ్రద్ధల తో పూజలు చేశారు. గుడిమల్కాపూర్లోని చారిత్రాత్మక జాంసింగ్ వేంకటేశ్వరస్వామి ఆలయం, రాంసింగ్పురాలోని బాలాజీ ఆలయం, తాళ్లగడ్డలోని రాధాక్రిష్ణ ఆలయం, విశ్వేశ్వర్నగర్లోని భద్రాద్రి సీతారామాలయంలో భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి పూజలు చేశారు.
జియాగూడలోని చారిత్రాత్మకమైన రంగనాథ స్వామి ఆలయంలో ముక్కోటి ఏకాదశి వేడుకలు శనివారం ఘనంగా జరిగాయి. తెల్లవారు జామున భక్తులకు ఉత్తర ద్వార దర్శనం కల్పించి పూజలు ప్రారంభించారు. ఆల య పూజారులు శేషాచార్యులు, తిరువెంగళాచార్యులు, బద్రి భక్తులకు ప్రసాదాలను అందజేశారు. మాజీ మంత్రి, ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్యాదవ్ స్వామి వారిని ఉత్తర ద్వార దర్శనం చేసుకున్నారు. కార్యక్రమంలో బేగంబజార్ కార్పొరేటర్ శంకర్యాదవ్, మాజీ కార్పొరేటర్లు మిత్ర కృష్ణ, బంగారి ప్రకాశ్, రాష్ట్ర కురుమ యువత అధ్యక్షుడు అరుణ్కుమార్, బీఆర్ఎస్ నాయకులు శేఖర్రెడ్డి, తదితరులు పూజల్లో పాల్గొన్నారు.