హైదరాబాద్, మే 25 (నమస్తే తెలంగాణ) : నగరంలోని సికింద్రాబాద్, హైదరాబాద్, కాచిగూడ వంటి రైల్వే స్టేషన్ల పై పడుతున్న రైళ్ల ఒత్తిడి, ప్రయాణికుల తాకిడి తగ్గించడం కోసం ఎంతో ఆర్భాటంతో మొదలు పెట్టిన చర్లపల్లి రైల్వే టెర్మినల్ పనులు నత్తనడకన కొనసాగుతున్నాయి. వాస్తవానికి గత ఏడాదిలోనే చర్లపల్లి రైల్వే టెర్మినల్ పనులు పూర్తి చేసి, ప్రయాణికుల సౌకర్యం కోసం అందుబాటులోకి తీసుకురావాలని భావించినా.. ప్రస్తుతం పనుల తీరు ఒక అడుగు ముందుకు, నాలుగు అడుగులు వెనక్కి అన్న చందంగా ఉన్నది.
చర్లపల్లి టెర్మినల్ పనులు పూర్తి చేసి, ఆ తర్వాత సికింద్రాబాద్ స్టేషన్ రీ డెవలప్మెంట్ పనులు మొదలు పెట్టడం వల్ల ఆ స్టేషన్పై పడుతున్న రైళ్ల ఒత్తిడిని కొంతవరకు తగ్గించవచ్చని తొలుత అధికారులు భావించారు. కానీ టెర్మినల్ పనులు లక్ష్యం ప్రకారం ముందుకు సాగకపోవడంతో సికింద్రాబాద్ స్టేషన్ అభివృద్ధి పనులు తప్పనిసరి పరిస్థితుల్లోనే మొదలు పెట్టాల్సి వచ్చినట్లు తెలుస్తున్నది.
వీలైనంత త్వరలోనే చర్లపల్లి రైల్వే టెర్మినల్ను ప్రారంభించి, అందుబాటులోకి తీసుకొస్తామని, గత ఫిబ్రవరిలో ఎస్సీఆర్ జీఎం పేర్కొన్నారు. కానీ మే నెల ముగుస్తున్నా.. ఇంత వరకు అతిగతి లేకుండా పోయింది. ఈ క్రమంలో రైల్వే జీఎం క్షేత్ర స్థాయి పరిశీలన చేశారు. టెర్మినల్ పనులు ఎంత వరకు పూర్తయ్యాయని, ఎందుకు పనులు ఆలస్యంగా నడుస్తున్నాయనేది తెలుసుకోవడం కోసం రైల్వే జీఎం ఈ నెల 23న చర్లపల్లి రైల్వేస్టేషన్ను సందర్శించారు. టెర్మినల్ పనులు మొత్తం పూర్తి కావడానికి ఇంకా ఎన్ని రోజుల సమయం పడుతుందన్న వివరాలతో తయారు చేసిన నివేదికను ఢిల్లీలోని రైల్వే బోర్డుకు పంపనున్నట్లు తెలిసింది.
చర్లపల్లి రైల్వే టెర్మినల్ నిర్మాణ పనుల కోసం రైల్వే బడ్జెట్లో మొత్తం రూ. 430 కోట్లు కేటాయించినట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఉన్నత స్థాయి ప్రమాణాలు, సకల సౌకర్యాలతో టెర్మినల్ నిర్మించాలన్న లక్ష్యంతో ఉన్నారు. అయితే అందుకు సంబంధించిన పనుల్లో మాత్రం జాప్యం జరుగుతున్నదని రైల్వే అధికారులు తెలిపారు. టెర్మినల్ ప్రారంభానికి ఇంకా ఎన్ని రోజులు సమయం పడుతుందనే అంశంపై క్లారిటీ రావాల్సి ఉంది.