కొండాపూర్, మార్చి 18 : తమను మోసం చేసిన వ్యక్తితోనే చేతులు కలిపి అమాయక ప్రజలను బురిడీ కొట్టిస్తున్న ఇద్దరు సైబర్ కేటుగాళ్లను చందానగర్ పోలీసులు అదుపులోకి తీసుకుని రిమాండ్కు తరలించారు. శనివారం పోలీసు స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాదాపూర్ డీసీపీ శిల్పవల్లి వివరాలు వెల్లడించారు. వేముల నాగ ప్రేమ్ (21), బనావత్ కుమార్ (20) ఓ ప్రైవేట్ కంపెనీలో పని చేస్తున్నారు. కాగా జైపూర్కు చెందిన జౌపేర్ అలియాస్ ఆన్లైన్లో నాగప్రేమ్, బనావత్కుమార్లను మోసం చేశాడు. సెల్ఫోన్లలో క్విక్ సపోర్ట్, ఎనీ డెస్క్, సర్వర్ మంకీ, క్విక్ షేర్ వంటి యాప్లను వినియోగిస్తూ మోసాలకు పాల్పడ్డాడు. కాగా కొంత కాలం తర్వాత వీరిని మోసం చేసిన వ్యక్తితోనే నాగప్రేమ్, బనావత్ కుమార్లు స్నేహం చేసి అదే తరహాలో మోసాలకు పాల్పడ్డారు.
ఈ క్రమంలో చందానగర్ బీఎస్ఎన్ఎల్ కార్యాలయం సమీపంలో సిమ్కార్డును వినియోగదారుడికి విక్రయించారు. సిమ్ యాక్టివేషన్ అయిన వెంటనే సందేశం వస్తుందని, ఆ సందేశాన్ని కస్టమర్ కేర్ టీమ్కు తెలియజేయాలని మరో నంబర్ను వినియోగదారుడికి ఇచ్చారు. మెసెజ్ వచ్చిన వెంటనే కస్టమర్ కేర్ నంబర్కు ఫోన్ చేయగా కేవైసీ అప్డేట్ అంటూ ఎనీడెస్క్ యాప్ను ఇన్స్టాల్ చేయించి వినియోగదారుడి నుంచి రూ.1,39,900 కొల్లగొట్టారు. బాధితుడి ఫిర్యాదు మేరకు చందానగర్ పోలీసులు నాగప్రేమ్తో పాటు బనావత్ కుమార్లను అదుపులోకి తీసుకున్నారు. వారిద్దరూ పలు పోలీసు స్టేషన్ల పరిధిలో 41 మందిని మోసం చేసినట్లు విచారణలో ఒప్పుకున్నారు. నిందితుల నుంచి రూ. 10 లక్షల విలువ చేసే మొత్తాన్ని రికవరీ చేశారు. సెల్ఫోన్లు, ల్యాప్టాప్లు, బైక్తో పాటు రూ. లక్షా 40 వేల నగదును స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. నిందితులను పట్టుకున్న చందానగర్ స్టేషన్ అధికారులు, సిబ్బందిని డీసీపీ అభినందించారు. సమావేశంలో మియాపూర్ ఏసీపీ నర్సింహారావు, చందానగర్ ఇన్స్పెక్టర్ కాస్ట్రో, డీఐ పాలవెల్లి, తదితరులు పాల్గొన్నారు.