తెలుగు యూనివర్సిటీ, జూన్ 28 : మహిళా, శిశు సంక్షేమం, అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తున్నదని మహిళా కమిషన్ చైర్పర్సన్ సునీతా లక్ష్మారెడ్డి అన్నారు. రాష్ట్ర మహిళా కమిషన్ ఆధ్వర్యంలో పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఆడిటోరియంలో మహిళల హక్కుల సాధికారతలో భాగంగా ఉపాధి ద్వారా మహిళా సాధికారత అనే అంశంపై బుధవారం సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు సునీతా లక్ష్మారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.
బాలికలు సంపూర్ణ విద్యావంతులు కావాలనే లక్ష్యంతో బాలికల విద్యకు ప్రాధాన్యతనిస్తూ సీఎం కేసీఆర్ పాఠశాలలను నెలకొల్పారని తెలిపారు. జాతీయ స్థాయిలో నిర్వహిస్తున్న పరీక్షల్లో తెలంగాణ విద్యార్థినులు ఉత్తమ ప్రతిభ కనబరుస్తున్నారని, ఇది మంచి పరిణామని పేర్కొన్నారు. చదువుతో పాటు ఉద్యోగం, ఉపాధి అవకాశాలను మహిళలు అందిపుచ్చుకునేలా ప్రభుత్వం రుణాలు అందించి స్వయం ఉపాధిని ప్రోత్సహిస్తూ మహిళా పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దుతున్న విషయాన్ని గుర్తు చేశారు.
మహిళా పారిశ్రామిక వేత్తలుగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ప్రభుత్వం స్టార్టప్లను ప్రారంభించిందన్నారు. వీహబ్ వ్యాపార ఆలోచన ఉన్న ప్రతి మహిళను విజయతీరాలకు చేర్చేలా కృషి చేస్తున్నదని చెప్పారు. ఈ సమావేశంలో మహిళా కమిషన్ సభ్యులు కుమ్ర ఈశ్వరీబాయ్, కటారి రేవతిరావు, డైరెక్టర్ శారద, కార్యదర్శి కృష్ణకుమారి, డీఆర్డీఓ డీపీఎం స్వర్ణలత, హైకోర్టు అడ్వకేట్ మంజూష, కృష్ణవేణి తదితరులు పాల్గొన్నారు.