ఆటోడ్రైవర్ల ఉపాధిపై కేంద్రం ‘714 నోటిఫికేషన్’ దెబ్బ
ఫిట్నెస్ ముగిసిన ఆటోలకు రోజుకు రూ.50 జరిమానా
రూ.వేలు, లక్షల్లో పెనాల్టీలతో బేజారు
ఆటో ధర కన్నా జరిమానే అధికమని గగ్గోలు
గ్రేటర్వ్యాప్తంగా నిలిచిన 3 వేల ఆటోలు
నమ్ముకున్న వృత్తి దూరమైందంటున్న డ్రైవర్లు
మూడు చక్రాలు తిరిగితేనే మూడు పూటలు గడిచేది.. కిస్తీలు, డీజిల్, నిర్వహణ పోను మిగిలేది అరకొరే.. వచ్చే సంపాదనతోనే ఇల్లంతా గడవాలి. ఇదీ ఆటోడ్రైవర్ల దుర్భర జీవితం. కరోనా తర్వాత వీరి పరిస్థితి పెనంలోనుంచి పొయ్యిలో పడినట్లయ్యింది. గిరాకీ లేక, వృత్తిని వదులుకోలేక నానాతిప్పలు పడుతుంటే వాహన సామర్థ్యం (ఫిట్నెస్) గడువు తీరిన ఆటోలకు రోజుకు రూ.50 చొప్పున పెనాల్టీ విధిస్తూ కేంద్రం ఇటీవల ‘714 గెజిట్ నోటిఫికేషన్’ విడుదల చేసింది. ఇది ఆటో్రడ్రైవర్ల పొట్టకొడుతున్నది. కరోనా కాలానికీ జరిమానా చెల్లించాలని నిర్దేశించడంతో ఆటోవాలాలు ఆగమవుతున్నారు. ఒక్కొక్కరికి వేలల్లో జరిమానా చెల్లించాల్సి రావడంతో చాలామంది ఆటోలు నడపడం మానేశారు. ఆటో ధర కన్నా జరిమానే ఎక్కువ ఉండడం..రోడ్డెక్కితే ఆటో సీజ్ చేస్తారన్న భయంతో చాలామంది వృత్తికి దూరమవుతున్నారు. ఫలితంగా ఇల్లు గడవడం కష్టంగా మారుతుండడంతో ప్రత్యామ్నాయ వృత్తి వైపు మళ్లేందుకు సిద్ధమవుతున్నారు. ఒక్క గ్రేటర్లోనే సుమారు 1.30 లక్షల ఆటోలు ఉన్నాయి.
సిటీబ్యూరో, మే 24(నమస్తే తెలంగాణ): ఒక్క గెజిట్ నోటిఫికేషన్.. లక్షలాది మంది మోటార్ కార్మికుల ఉపాధిని ప్రశ్నార్థకం చేసింది. ఏండ్ల తరబడి ఆటోనే తమ జీవనాధారంగా బతుకుతున్న డ్రైవర్ల బతుకుదెరువును దెబ్బతీసింది. కరోనా రోజులకు కూడా జరిమానా విధిస్తూ కేంద్రం తీసుకొచ్చిన 714 గెజిట్ నోటిఫికేషన్తో ఆటో డ్రైవర్లు తమ వాహనాల ఫిట్నెస్ జరిమానాలు చెల్లించలేక ఆటోలను నడపడం ఆపేస్తున్నారు. రోడ్డెక్కాలంటే ఆటోను సీజ్ చేస్తారేమోనని భయపడుతున్నారు. ఈ నోటిఫికేఫన్పై దేశ వ్యాప్తంగా డ్రైవర్లు కేంద్రంపై కన్నెర్ర చేస్తున్నారు. కర్ణాటక డ్రైవర్లు కోర్టుకెళ్లిన విషయం తెలిసిందే. కేంద్రం పునరాలోచన చేసి పెనాల్టీలు రద్దు చేయాలని తెలంగాణ వాహన సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
ఇరవయ్యేండ్లుగా అదే ఆధారం..
“అతడి పేరు అజీజ్ మహ్మద్. 20 ఏండ్లుగా ఆటోనే తన జీవనాధారం. ఎలాంటి గడువు లేకుండా 714 గెజిట్ నోటిఫికేషన్ అమలుతో తన వాహన ఫిట్నెస్ జరిమానా రూ.92,800 వచ్చింది. రోజూ ఆటో నడిపితే వచ్చే రూ.400 ఆదాయం కుటుంబాన్ని పోషించడం, అద్దె ఖర్చులకే సరిపోతుండటంతో అంత జరిమానా చెల్లించడం కుదరకపోవడంతో ఆ ఆటోను మరో వ్యక్తికి అమ్ముకున్నాడు.”
కేంద్రం భారం.. వృత్తికి దూరం
యాదగిరి ఆటోడ్రైవ ర్. 15 ఏండ్లుగా ఆ టోనే నమ్ముకొని జీవిస్తున్నాడు. ఇటీవల నడపడం మానేశాడు. కారణం కేంద్రం అమలు చేస్తున్న 714 గెజిట్ నోటిఫికేషన్. ఫిట్నెస్ కోసం రోజుకు రూ.50 చొప్పున రూ.1.62 లక్షలు పెనాల్టీ వచ్చింది. ఇంత చెల్లించలేక, ఏం చేయాలో తోచక ఆటో నడపడం బంద్ చేశాడు.
ప్రభుత్వాలు మాపై దయ చూపాలి
గ్రేటర్లో ఇప్పటి వరకు 3000లకు పైగా ఆటో డ్రైవర్లకు లక్షకు పైగా జరిమానాలు వచ్చాయి. వాటిని చెల్లించే స్థోమత మాబోటోళ్లది. ఆటోలను అమ్ముకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. అయినా కొనేవారు ఉండరు. ఆ ఆటోలను ఏం చేసుకోవాలో కేంద్రమే సమాధానం చెప్పాలి. రోడ్డెక్కితే అధికారులు పెనాల్టీ చెల్లించలేదని సీజ్ చేస్తారనే భయంతో ఆటోను నడపడం ఆపేశాం. ఇల్లు గడవడం కష్టమైంది. అసలే కరోనా పరిస్థితులతో అల్లాడిపోతుంటే.. ఈ పెనాల్టీల బెడదతో భయంగా బతుకుతున్నాం.
– సత్తిరెడ్డి, ఆటో యూనియన్ నాయకులు