పెరుగుతున్న మందుల ధరలు..
సిటీబ్యూరో, మార్చి 30: కేంద్రం ఫార్మా కంపెనీల లాబీయింగ్కు తలొగ్గింది. దీంతో సాధారణ మందులతో పాటు దీర్ఘకాలిక వ్యాధుల మందుల రేట్లు కూడా భారీగా పెరగనున్నాయి. నేషనల్ ఫార్మాస్యూటికల్స్ ప్రైజింగ్ అథారిటీ ఈ మందులపై 10 శాతం పెంచింది. ఈ అథారిటీలో మినిస్ట్రీ ఆఫ్ పెట్రో కెమికల్స్, మినిస్ట్రీ ఆఫ్ హెల్త్కు సంబంధించిన అధికారులు ఉంటారు. కేంద్ర ప్రభుత్వంపై ఫార్మా కంపెనీలు ఒత్తిడిని తీసుకువచ్చి నేషనల్ ఫార్మాస్యూటికల్స్ ప్రైజింగ్ అథారిటీ ద్వారా మందుల ధరలను పెంచుకుంటున్నారు. మందులను తయారు చేసే ముడి సరుకు, ప్యాకింగ్, తదితర అంశాలకు సంబంధించిన ధరలు పెరిగాయని, ఇది భారంగా మారందని ఫార్మా సంస్థలు కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయడంతో 10 శాతం ధరలను ఎన్పీపీఏ పెంచింది. ఈ పెరిగిన ధరలు ఏప్రిల్ ఒకటి నుంచి అమలులోకి రానున్నాయి. దీంతో అత్యవసర, ఇతర లైఫ్ సేవింగ్, ఇతరత దాదాపు 850 మందులపై ధరలు పెరగనున్నాయి.
ఇది సరికాదు..
ఫార్మా కంపెనీలకు అనుకూలంగా మందుల ధరలను పెంచడాన్ని ఫెడరేషన్ ఆఫ్ మెడికల్ అండ్ సేల్స్ రిప్రెజంటేటీవ్స్ ఆఫ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా తప్పు బడుతున్నది. మందులు తయారు చేస్తున్న ఫార్మా కంపెనీలకు లాభాలు ఉంటాయని, దీనికి తోడుగా ధరలను పెంచుకునేందుకు కంపెనీలకు సహకరించడం విడ్డూరంగా ఉన్నదన్నారు. బంగారంపై 3 శాతం జీఎస్టీని అమలు చేస్తున్న కేంద్ర ప్రభుత్వం, సామాన్యుడి మందుల మీద 5 నుంచి 18 శాతం జీఎస్టీని వసూలు చేస్తున్నదని ఫెడరేషన్ విమర్శించింది.
ఫార్ములా ఒకటే..
దేశంలో దాదాపు 350 ఫార్మా కంపెనీలు ఉన్నాయి. వారందరూ వివిధ రోగులకు సంబంధించిన 850 రకాల మందులు తయారు చేస్తున్నారు. ఫార్ములా ఒకటే ఉంటుంది. కాని కంపెనీలు వేర్వేరుగా ఉండటంతో ధరల్లో కూడా తేడా ఉంటుంది.
కేంద్రం అండతోనే..
కేంద్రం ఫార్మా కంపెనీలకు అండగా నిలబడటం వల్లే ఈ పరిస్థితి అని ఫెడరేషన్ ఆఫ్ మెడికల్ అండ్ సేల్స్ రిప్రెజంటేటీవ్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా, తెలంగాణ మెడికల్ అండ్ సేల్స్ రిప్రజంటేటీవ్స్ యూనియన్ సంయుక్త ప్రధాన కార్యదర్శి ఎ.నాగేశ్వరరావు ఎద్దెవ చేశారు. కేంద్ర ప్రభుత్వానికి ప్రజా ఆరోగ్యం మీద చిత్తశుద్ధి ఉంటే ముందుగా ఆరోగ్య బడ్జెట్ను 1.2 శాతం నుంచి 5 శాతానికి పెంచాలన్నారు. ధరల నియంత్రణను ప్రభుత్వమే నిర్వహించాలని సూచించారు. ప్రభుత్వ ఫార్మా రంగ సంస్థలను పునరుద్ధరించాలని, ఫార్మా సంస్థలు వారి మందుల అమ్మకాల కోసం చేస్తున్న మార్కెటింగ్ ఖర్చులపై నిఘా పెంచాలన్నారు. ధరలతో పాటు మందుల నాణ్యతను కూడా తనిఖీ చేసేందుకు ఓ వ్యవస్థను కేంద్రం ఏర్పాటు చేయాలని ఎ.నాగేశ్వరరావు డిమాండ్ చేశారు.