సర్వీస్ చార్జీల బకాయిల విడుదలకు మొండిచేయి
బకాయిలపై త్వరలో ధర్నాకు టీఆర్ఎస్ సన్నద్ధం
సికింద్రాబాద్, మార్చి 28: దేశంలోని కంటోన్మెంట్లలో అతిపెద్దది అయిన సికింద్రాబాద్ కంటోన్మెంట్లో వివిధ అభివృద్ధి కార్యకలాపాలకు నిధుల కొరత అడ్డంకిగా నిలుస్తోంది. దశాబ్ధాలుగా ఉన్న ఈ పరిస్థితికి ప్రధాన కారణంగా కేంద్రం నిలుస్తుంది. సమస్య మూలాల్లోకి వెళ్లి పరిష్కార మార్గాలు వెదకకపోవడంతోనే బోర్డు పరిస్థితి ఇక్కడిదాకా వచ్చిందని పలువురు అభిప్రాయపడుతున్నారు. అయితే, దేశంలో ఉన్న ఇతర కంటోన్మెంట్ల పట్ల ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవరిస్తున్న వైఖరికి తమకూ ఉన్న స్పష్టమైన తేడాను చూడాలని అధికార పార్టీ టీఆర్ఎస్ అంటోంది. సిటీలోని ఇతర నియోజకవర్గాలలో అమలు అవుతున్న అన్ని సంక్షేమ పథకాలను ఈ కంటోన్మెంట్లో కూడా వర్తింపజేయడం ప్రజల పట్ల తమకు ఉన్న బాధ్యతకు ఓ నిదర్శనం అని సర్కారు పేర్కొంటుంది.
బకాయిలు చెల్లిస్తూ ముందుకు
కంటోన్మెంట్ అభివృద్ధి పట్ల ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరిస్తూ ముందుకు సాగుతుంది రాష్ట్ర సర్కారు. కంటోన్మెంట్లోని ఆస్తుల రిజిస్ట్రేషన్కు సంబంధించి ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ ట్యాక్స్ (టీపీటీ) నిధులు రాష్ట్ర ప్రభుత్వ ఖాతాలోకి వెళ్తున్నా, ఆపై కంటోన్మెంట్ బోర్డుకు చెల్లిస్తూ వస్తుంది. అయితే కరోనా నేపథ్యం నుంచి ఈ బకాయిలు రూ. 50 కోట్లకు పైగా చేరాయి. కేంద్రం ప్రభుత్వం విడుదల చేసే ఆర్థిక సంఘం నిధుల్లో బోర్డుకు చెల్లించవలసిన వాటా ఎప్పటికప్పుడు చెల్లిస్తూ బోర్డు అభివృద్ధికి కృషి చేస్తుంది.
‘కేంద్రం’ తీరుపై జనాగ్రహం
కేంద్ర ప్రభుత్వం కంటోన్మెంట్ అభివృద్ధికి పెద్దగా సహకరించడం లేదు. కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలు, మిలటరీ సంస్థలు, కార్యాలయాల నుంచి సర్వీసు చార్జీల పేరిట సికింద్రాబాద్ కంటోన్మెంట్కు రూ. 680 కోట్లు బకాయి పడింది. ఈ బకాయిల్లో కనీసం రూ. 100 కోట్లయినా చెల్లించాలని స్థానిక ప్రజాప్రతినిధులు మొర పెట్టుకుంటున్నా ఫలితం ఉండటం లేదు. త్వరలోనే టీఆర్ఎస్ పార్టీ నేతృత్వంలో బోర్డు కార్యాలయం ఎదుట సర్వీస్ చార్జీల బకాయిలను విడుదల చేయాలంటూ ధర్నాకు దిగనున్నట్లు పార్టీ నేత ఒకరు ప్రకటించారు.
కేంద్రం దిగొచ్చేలా ఆందోళనలు
కంటోన్మెంట్ బోర్డుకు రావాల్సిన నిధుల విషయంలో కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతున్నాం. టీపీటీ నిధులను రాష్ట్ర సర్కారు విడతల వారీగా విడుదల చేస్తున్నా కేంద్రం మాత్రం ఆర్మీకి చెందిన సర్వీస్ చార్జీల బకాయిలను విడుదల చేయకుండా చోద్యం చూస్తుంది. దీనికి సంబంధించి బోర్డు ఎదుట ఆందోళన చేపట్టడానికి సమాయత్తం అవుతున్నాం. కనీసం 50 శాతం బకాయిలు విడుదల చేసినా కంటోన్మెంట్ బోర్డు పరిధిలోని ప్రాంతాలు అభివృద్ధి అవుతుంది.
– జక్కుల మహేశ్వర్రెడ్డి, మాజీ ఉపాధ్యక్షుడు, కంటోన్మెంట్ బోర్డు