దేశాభివృద్ధికి మెట్రో నగరాలే ఆర్థిక పట్టుకొమ్మలు. అంతర్జాతీయ పెట్టుబడులు ఆకర్షించేలా మెట్రో నగరాల్లో వసతులు ఉండాలని కొండంత రాగం తీసిన కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో మాత్రం గోరంత సాయం చేసింది. దేశవ్యాప్తంగా మెట్రో నగరాల అభివృద్ధి కోసం కేవలం రూ. 10 కోట్లు కేటాయించి చేతులు దులుపుకున్నది. గత రాష్ట్ర బడ్జెట్లో తెలంగాణ ప్రభుత్వం పట్టణాభివృద్ధి రూ. 10 కోట్లు కేటాయించి తన చిత్తశుద్ధిని చాటుకున్నది. పన్నులు విపరీతంగా పెంచి కార్పొరేట్లకు దోచిపెడుతున్న మోదీ ప్రభుత్వం దేశవ్యాప్తంగా పట్టణాభివృద్ధికి ఇచ్చిందే పదివేలు అన్నట్లు వ్యవహరించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం కేటాయింపులపై నగరవాసులు పెదవి విరుస్తున్నారు.
– సిటీబ్యూరో, ఫిబ్రవరి 1 (నమస్తే తెలంగాణ)
సిటీబ్యూరో, ఫిబ్రవరి 1 (నమస్తే తెలంగాణ): దేశంలోని మెట్రో నగరాలు ఎంతో కీలకమైనవి. అలాగే దేశానికి ఆర్థిక పరిపుష్టిని ఇచ్చేవి. అంతర్జాతీయ పెట్టుబడులు రావడంతో పాటు దేశాభివృద్ధికి తోడ్పడేలా పట్టణాల అభివృద్ధి జరగాల్సి ఉంది. తాజాగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన బడ్జెట్లో పట్టణాల మౌలిక వసతుల కల్పనకు రూ.10వేల కోట్లు కేటాయించామని గొప్పగా చెప్పింది. గత రాష్ట్ర బడ్జెట్లోనే పట్టణాభివృద్ధికి రూ.10వేల కోట్లు తెలంగాణ సర్కారు కేటాయించింది. అయితే దేశంలోని వందలాది పట్టణాల్లో రోడ్లు, మంచినీరు, డ్రైనేజీ వంటి మౌలిక వసతులకు రూ.10వేల కోట్లు ఏ మూలకు సరిపోతాయని నగర వాసులు పెదవి విరుస్తున్నారు.
మెట్రో నగరాల అభివృద్ధికి కేంద్ర నుంచి సరైన ప్రణాళిక, ప్రోత్సాహకాలు, బడ్జెట్లో కేటాయింపులు లేవనడానికి తాజా పరిస్థితులే ఇందుకు నిదర్శనం. కేంద్రంలోని మోడీ సర్కార్ హైదరాబాద్ సహా ఇతర మెట్రో నగరాలపై దృష్టి సారించడం లేదని తెలిసిపోయింది. దేశంలో శరవేగంగా పెరుగుతున్న పట్టణీకరణకు అనుగుణంగా అభివృద్ధి ప్రణాళికలు, అదే స్థాయిలో నిధులు కేటాయించాలి. అప్పుడే ఆయా మెట్రో నగరాలు అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చెందుతాయని, విదేశాల నుంచి పెద్ద మొత్తంలో పెట్టుడులను రాబట్టేందుకు మార్గం సుగమంగా ఉంటుంది. దేశానికి ఆర్థిక కొమ్మలైన మెట్రో నగరాల విషయంలో మోడీ సర్కార్ సరైన భవిష్యత్ ప్రణాళికలు రూపొందించలేదని పట్టణాభివృద్ధి నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
గ్రేటర్లో 8 ఏండ్లలో 70 వేల నుంచి 80 వేల కోట్ల వ్యయం..
దేశంలో ప్రధాన మెట్రో నగరాల్లో ఒకటిగా ఉన్న హైదరాబాద్ మహానగరాన్ని విశ్వనగరంగా తీర్చిదిద్దాలన్న ప్రణాళికతో తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేకంగా పనిచేస్తోంది. అందులో భాగంగానే రాష్ట్ర బడ్జెట్లో పట్టణాభివృద్ధికి ప్రతియేటా రూ.10వేల కోట్లు ఖర్చు చేస్తోంది. ఎనిమిదేండ్లలో రూ.70 వేల నుంచి 80 వేల కోట్లను ఖర్చు చేసి వివిధ ప్రాజెక్టులను చేపట్టింది. నగరంలో మురుగునీటి శుద్ధి విజయవంతంగా కొనసాగుతుండగా, తడి,పొడి చెత్త విషయంలో ఇప్పటికే రాష్ట్ర సర్కారు సమర్థవంతంగా నిర్వహణ చర్యలు చేపట్టింది. ముఖ్యంగా హైదరాబాద్ మహానగరంలో మూసీనది సుందరీకరణ ప్రాజెక్టుకే రూ. 8వేల కోట్ల దాకా ఖర్చవుతాయని రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేసింది. ఇలాంటి ప్రాజెక్టుకు కేంద్రం నుంచి ఎలాంటి మద్దతు రావడం లేదు. దీంతో పాటు హైదరాబాద్ మెట్రో రైలు రెండో దశకు నిధుల అవసరం ఉంది. దీనికోసం ఈ బడ్జెట్లో నిధులు కేటాయిస్తారని అనుకుంటే కేంద్రం మొండి చేయి చూపింది. విశ్వనగరం హైదరాబాద్కు కేంద్రం సరైన ప్రాధాన్యత ఇవ్వడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.