సెల్ఫోన్ అనేది ఇప్పుడు నిత్యావసరమయ్యింది.. చేతిలో ఫోన్ లేకుండా బయటకు వెళ్లలేని పరిస్థితి. అయితే.. ఇటీవల ఫోన్లు ఎక్కువగా అదృశ్యమవుతున్నాయి.. ఇందులో కొందరు నిర్లక్ష్యంతో పోగొట్టుకుంటుండగా.. మరికొందరు ప్రయాణంలో లేదా బయట మర్చిపోతున్నారు.. ప్రతి రోజు మూడు పోలీస్ కమిషనరేట్ల పరిధిలో సుమారు 400 వరకు ఫోన్లు మిస్సవుతున్నాయి. ఇందులో సగానికిపైగా వ్యక్తుల నిర్లక్ష్యంతో పోతున్నాయి. మిస్సింగ్లపై ఫిర్యాదు అందిన వెంటనే పోలీసులు స్పందిస్తున్నారు.. ఐఎంఈఐ నంబర్ ఆధారంగా ట్రేస్ చేసి పట్టుకుంటున్నారు. ఇటీవల అంబర్ పేట పోలీసులు 58 మిస్సింగ్ అయిన సెల్ఫోన్లను ట్రేస్ చేసి పట్టుకున్నారు. అయితే.. ఫోన్ల చోరీలపై పోలీసులు అనౌన్స్మెంట్ సిస్టమ్ ద్వారా ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు.
సెల్ఫోన్ కంపెనీలు ఫోన్ తయారీ సమయంలో ఒక్కో ఫోన్కు ఒక ఐఎంఈఐని కేటాయిస్తారు. ప్రపంచంలో ఒక ఫోన్కు ఒకే ఐఎంఈఐ నంబర్ ఉంటుంది. ఈ నంబర్ ఆధారంగా సెల్ఫోన్తో పాటు అందులో ఉపయోగించే నెట్వర్క్ను కూడా గుర్తించే అవకాశం ఉంటుంది. అయితే.. సెల్ఫోన్ల ముఠాలు దొంగిలించిన ఫోన్లు రాష్ట్ర సరిహద్దులను దాటేస్తాయి. మన రాష్ట్రంలో చోరీ అయినవని మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, గుజరాత్, జార్ఖండ్ వంటి రాష్ర్టాలకు.. ఇతర రాష్ర్టాల్లో దొంగిలించిన సెల్ఫోన్లను మన రాష్ట్రంతో పాటు పక్క రాష్ర్టాల్లో ఈ ముఠాలు విక్రయిస్తుంటాయి. దొంగిలించిన సెల్ఫోన్లను ఇతర రాష్ర్టాల్లో విక్రయించడం వల్ల ఐఎంఐఈ నంబర్ను గుర్తించడం కష్టమవుతుంది. కొన్ని సెల్ఫోన్లకు ఐఎంఈఐ నంబర్ మార్చే అవకాశముంటుంది. తక్కువ ధర పలికే హ్యాండ్సెట్లలోని ఐఎంఈఐ నంబర్ను ఎక్కువ ధర ఉన్నవాటికి మార్చి విక్రయిస్తుంటారు. పేరున్న కంపెనీలకు సంబంధించిన ఐఎంఈఐ నంబర్లు మార్చేందుకు అవకాశాలు లేవు. ఈలాంటి ఫోన్లను విడిభాగాలుగా చేసి ఈ ముఠాలు విక్రయిస్తుంటాయి. అయితే.. చాలా వరకు సెల్ఫోన్ దొంగల ముఠాలను ట్రై పోలీస్ కమిషనరేట్ల పోలీసులు అణిచి వేశారు.
పోలీస్ స్టేషన్లకు సెల్ఫోన్లు పోయాయంటూ వస్తున్న ఫిర్యాదుల్లో ఎక్కువగా నిర్లక్ష్యంతో పోతున్నవే ఉంటున్నాయి. బైక్పై వెళ్తుండగా పాకెట్లో నుంచి పడిపోవడం, బస్సు ఎక్కుతుండగా కిందపడటం, చార్జ్జింగ్ పెట్టి మర్చిపోవడం, హోటల్స్లో కూర్చొని మర్చిపోవడం… ఇలా సెల్ఫోన్ను మర్చిపోతుండటంతో ఎక్కువగా మిస్సింగ్లు జరుగుతున్నాయి. ఇలా మిస్సింగ్ అయిన సెల్ఫోన్లు దొరికిన కొందరు స్వచ్ఛందంగా అందిస్తుండగా… మరికొందరు వాటి ని తక్కువ ధరకు విక్రయిస్తుంటారు. తెలిసి తెలియక ఇలాంటి ఫోన్లు కొన్నవారు, అది దొంగ ఫోన్ అనగానే స్వచ్ఛందగా పోలీసులకు అప్పగిస్తున్నారు.
నగరంలో సెల్ఫోన్ల చోరీలను, చిన్న చిన్న దొంగతనాలను పూర్తిస్థాయిలో కట్టడి చేసేందుకు పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు.. ఇందులో భాగంగా రద్దీగా ఉండే ఎస్ఆర్నగర్ ఠాణా పరిధిలో చోరీలపై ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. అలాగే సెల్ఫోన్ దొంగతనాలు, స్నాచింగ్లు, తక్కువ ధరకు బంగారం, వాహనాలు విక్రయిస్తామంటూ సైబర్ సంబంధిత నేరాలకు సంబంధించిన ప్రకటనలు చూసి మోసపోవద్దని ప్రజలకు అనౌన్స్మెంట్ సిస్టమ్ ద్వారా వివరిస్తున్నారు.. ఫలితంగా ఫోన్లకు సంబంధించి నెలకు 50 వరకు వచ్చే ఫిర్యాదులు.. ఇప్పుడు 10 వరకు మాత్రమే వస్తున్నాయని ఎస్ఆర్నగర్ ఇన్స్పెక్టర్ సైదులు పేర్కొన్నారు.
సెల్ఫోన్ దొంగతనాలు, స్నా చింగ్లను హైదరాబాద్లో చాలావరకు కట్టడి చేశాం. వ్యక్తుల నిర్లక్ష్యం కారణంగా సెల్ఫోన్లు అదృశ్యమవుతున్నాయి. ఇలాంటి ఫిర్యాదులపై వెంటనే స్థానిక పోలీసులు స్పందిస్తున్నారు. ఫిర్యాదులు అందగా నే ఐఎంఈఐ నంబర్ను ట్రేస్ చేసేందుకు, ఆయా నెట్వర్క్ ప్రొవైడర్లకు లేఖలు రాస్తున్నాం. నెట్వర్క్ ప్రొవైడర్ల నుంచి కూడా త్వరగా స్పందన వస్తే.. ఆయా ఫోన్ల ట్రేసింగ్ వేగంగా జరుగుతుంటుంది. సెల్ఫోన్ కొన్నవారు కొన్న రశీదును భద్రంగా ఉంచుకోవడం మంచిది. ఫోన్ ఎప్పుడైనా దొంగతనానికి గురైనా, అదృశ్యమైనా ఐఎంఈఐ నంబర్తో గుర్తించేందుకు అవకాశముంటుంది.