మూసాపేట, డిసెంబర్11: నగరంలో నేరాలను అరికట్టడంలో సీసీ కెమెరాలు దోహదం చేస్తున్నాయి. తెలంగాణ ఏర్పడిన తర్వాత నగరంలో సీసీ కెమెరాల ఏర్పాటుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. నగరంలోని అన్ని పోలీస్స్టేషన్ల పరిధిలో కెమెరాలను ఏర్పాటు చేయడంతో నేరాల సంఖ్య గణనీయంగా తగ్గింది. వ్యాపార కేంద్రంగా అభివృద్ధి చెందిన కూకట్పల్లిలో నేరాల సంఖ్యను అదుపులో పెట్టడానికి పోలీసులు కృషి చేస్తున్నారు. కమ్యూనిటీ పోలీసింగ్లో భాగంగా 1039 సీసీ కెమెరాలు, నేను సైతంలో భాగంగా 6221 సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. నిత్యం పెట్రోలింగ్, 24 గంటలు సీసీ టీవి కెమెరాల పర్యవేక్షణతో నేరాల కట్టడికి కృషి చేస్తున్నారు. రోడ్డు ప్రమాదాలు, దొంగతనాల కేసుల మిస్టరీ ఛేదించడంలో కెమెరాల పాత్ర ఉన్నది. కెమెరాలు ఏర్పాటు చేయడం ద్వారా లాభాలను ప్రజలకు అవగాహన కల్పించడంతో పాటు ఆయా పరిసరాలలో ఏర్పాటు చేసుకునేలా చర్యలు తీసుకుంటున్నారు.
సీసీ కెమెరాల ఏర్పాటుతో భద్రత రెట్టింపు
సీసీ టీవీ కెమెరాల ఏర్పాటుతో నేరాల సంఖ్య గణనీయంగా తగ్గింది. కూకట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఇప్పటికే కమ్యూనిటీ పోలీసింగ్లో 1039, నేను సైతంలో భాగంగా 6221 సీసీ టీవీ కెమెరాలను ఏర్పాటు చేశాం. కూకట్పల్లి ఠాణ పరిధిలోని బస్తీలు, కాలనీల సంక్షేమ సంఘం నాయకులతో సమవేశాలు ఏర్పాటు చేసి కాలనీవాసులకు సీసీటీవి కెమెరాల ఏర్పాటుపై అవగాహన కల్పిస్తున్నాం. కెమెరాల ఏర్పాటు తర్వాత మిస్టరీ కేసులను త్వరితంగా ఛేదించగలుగుతున్నాం.
– సీఐ నర్సింగ్రావు