సిటీబ్యూరో, నవంబర్ 3(నమస్తే తెలంగాణ): అధిక లాభాల పేరుతో రెండు తెలుగు రాష్ర్టాలలో వందలాది మంది నుంచి కోట్లాది రూపాయలు వసూలు చేసిన కేసులో ఒక సినీ నిర్మాత పాత్ర కూడా కీలకంగా ఉందని సీసీఎస్ పోలీసులు భావిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లోని ఎన్టీఆర్ జిల్లాకు చెందిన గుదే రాంబాబు, పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన పెన్మత్స కృష్ణంరాజులు 200 మందిని రూ.530 కోట్లు మోసం చేయగా, ఈ కేసులో ఇటీవల వారిని సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. రాధారామ్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో సంస్థను ప్రారంభించి మొదట్లో విజయవాడలో చాక్లెట్ల డిస్ట్రిబ్యూషన్, అందులో లాభాలు రావడంతో వ్యాపారాన్ని మరింతగా విస్తరించి పలువురి నుంచి మొదట ఆర్థిక సహకారం తీసుకున్నారు. ఆ తరువాత ఫస్ట్ మూవింగ్ కన్జ్యూమర్ గూడ్స్ను విక్రయిస్తూ, ఆ వ్యాపారాన్ని పెద్దది చేశారు.
ఇందుకు తెలిసిన వారు, బంధువులు, స్నేహితుల నుంచి భారీ ఎత్తున పెట్టుబడులు సేకరించారు. 6 నుంచి 13 శాతం పెట్టుబడిపై ప్రతి నెల లాభాల ఇస్తామంటూ నమ్మించి, మొదట అందరికి మాట ప్రకారం చెల్లింపులు చేశారు. అందరికి నమ్మకం కుదరడంతో అసలు వ్యాపారాన్ని వదిలేసి, కేవలం పెట్టుబడులు వసూలు చేసి, వచ్చిన దాంట్లో పాత వారికి లాభాల పేరిట చెల్లింపులు చేస్తూ మల్టీ లెవల్ వ్యాపారాన్ని నిర్వహించారు. ఇలా 200 మంది నుంచి రూ.530 కోట్లు వసూలు చేసి, టర్నోవర్ చేసి మోసం చేయడంతో బాధితులు సీసీఎస్లో ఇటీవల ఫిర్యాదు చేశారు. దీంతో నిందితులిద్దరిని అరెస్ట్ చేశారు. అరెస్ట్ విషయం తెలియగానే మరింత మంది బాధితులు సీసీఎస్ పోలీసులను ఆశ్రయిస్తున్నారు. వీళ్ల మోసాలు వెయ్యి కోట్లకు పైగానే ఉండే అవకాశాలున్నాయని పోలీసులు భావిస్తున్నారు. కాగా, విచారణలో సినీ నిర్మాత అట్లూరి నారాయణ రావు పాత్ర ఉన్నట్లు బయటపడటంతో ఈ కేసులో అతడిని కూడా నిందితుడిగా చేర్చారు. ఇప్పటికే అరస్టైయిన ప్రధాన నిందితులను కస్టడీలోకి తీసుకొని విచారించేందుకు సీసీఎస్ పోలీసులు సిద్ధమవుతున్నారు.
అధిక లాభాల పేరుతో రెండు తెలుగు రాష్ర్టాలలో వందలాది మంది నుంచి కోట్లాది రూపాయలు వసూలు చేసిన చేసిన కేసులో సినీ నిర్మాత అట్లూరి నారాయణరావు పాత్ర కూడా కీలకంగా ఉందని సీసీఎస్ పోలీసులు భావిస్తున్నారు. ఇతనిపై సీసీఎస్లో 2018లోను ఒక కేసు నమోదైనట్లు వెలుగులోకి వచ్చింది. బంజారాహిల్స్లోని ఆదిత్య హిల్టాప్ అపార్టుమెంట్స్లో నివసించే అట్లూరి నారాయణరావు, దేవాదాయ శాఖకు చెందిన స్థలాన్ని చూపించి, బంజారాహిల్స్కు చెందిన వ్యాపారి నుంచి రూ.1.65 కోట్లు కాజేశాడనే అభియోగాలపై కేసు నమోదయ్యింది. అధిక లాభాలు గడించాలనే కేసే కాకుండా.. నారాయణరావు గతంపై ఆరా తీయగా సీసీఎస్లో 2018లో నమోదైన కేసు వ్యవహారం వెలుగులోకి వచ్చింది. శేరి లింగంపల్లిలోని తారానగర్లో దేవాదాయ ధర్మాదాయ శాఖకు 3 ఎకరాల భూమికి నకిలీ పత్రాలు సృష్టించి ఒక పథకం ప్రకారం, ఖైరతాబాద్లోని ఎస్ఎంహెచ్ హోల్డింగ్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ నిర్వాహకుడైన మహమూద్ హుస్సేన్ను రూ. 1.65 కోట్లకు మోసం చేశాడు. ఈ విషయంపై సీసీఎస్లో హుస్సేన్ కేసు నమోదు చేశాడు. నారాయణరావు గురించి ఆరా తీయడంతో గతంలో నమోదైన కేసులు ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి.