సిటీబ్యూరో, నవంబర్ 10 (నమస్తే తెలంగాణ): నగర రోడ్లపై ట్రాఫిక్ సాఫీగా వెళ్లేందుకు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు చేపట్టిన ‘రోప్’ (రిమూవల్ అబ్స్ట్రక్టివ్ పార్కింగ్ ఎంక్రోచ్మెంట్స్)ను పకడ్బందీగా అమలు చేయడంలో నిఘా నేత్రలు నేను సైతం అంటున్నాయి. ట్రాఫిక్ నిబంధనలు పాటించని వాహనదారులను అప్రమత్తం చేయడంతో పాటు ఉల్లంఘనదారులకు జరిమానాలు సైతం విధించడంలో కూడళ్లలో ఉన్న నిఘా నేత్రాలు తమ వంతు పాత్రను పోషిస్తున్నాయి. కూడళ్లలో స్టాప్ లైన్ వద్ద వాహనం ఆపకపోవడం, ఫ్రీ లెఫ్ట్ను బ్లాక్ చేయడం, రాంగ్ సైడ్ డ్రైవింగ్, ట్రాఫిక్కు అంతరాయం కలిగించే వాహనాలు, అక్రమ పార్కింగ్పై వెంటనే కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్కు ఆయా వాహనాల ఉల్లంఘనలకు సంబంధించిన చిత్రాలను చేరవేస్తున్నాయి. నిఘా కెమెరాలు ఉన్నాయన్న భయంతో కొంతమంది ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తున్నారు. చలాన్లు పడకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ట్రాఫిక్ రూల్స్ పాటించని వారిపై కెమెరాలు అందిస్తున్న చిత్రాలతో ట్రాఫిక్ పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. ఇందుకు ఐటీఎంఎస్ (ఇంటిగ్రేటెడ్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ సిస్టమ్)తో పాటు కూడళ్లలో ఉన్న ఇతర సీసీ కెమెరాలను ట్రాఫిక్ పోలీసులు ఉపయోగిస్తున్నారు.
70 కూడళ్లలో కెమెరాలు..
నగరంలో సుమారు 70 కూడళ్లలో ప్రత్యేకంగా ఐటీఎంఎస్ కెమెరాలు పనిచేస్తున్నాయి. సాధారణ కెమెరాలు మరో 100 కూడళ్లలో ఉన్నాయి. ఈ కెమెరాలన్నీ సీసీసీకు అనుసంధానమై ఉంటున్నాయి. సిగ్నల్ వద్ద కానిస్టేబుల్ కనిపించడం లేదని, సిగ్నల్ జంప్ చేస్తే కెమెరాలు పట్టుకుంటాయి. ఉల్లంఘనలను రికార్డు చేస్తూ సీసీసీకు చేరవేస్తాయి. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించడంతో ట్రాఫిక్ సాఫీగా వెళ్తుందని నగర ట్రాఫిక్ పోలీసులు చెబుతున్నారు. ఇందుకు అవగాహన కార్యక్రమాలు చేపట్టడంతో చాలా మందిలో మార్పు వచ్చిందని పోలీసు అధికారులు చెబుతున్నారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరిస్తున్నారు.
ఉల్లంఘనల కట్టడికి..
ఐటీఎంఎస్ విధానంలో ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడే ప్రతి వాహనదారుడిని ఈ కెమెరాలు గుర్తించి వారికి చలాన్ విధిస్తాయి. సాధారణ కెమెరాలతో కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్(సీసీసీ) నుంచి సిబ్బంది ఉల్లంఘనలు గుర్తించి ఆయా వాహనాలపై చలాన్లు జారీ చేస్తుంటారు. ఈ కెమెరాలు ట్రాఫిక్ నియంత్రణ, ఉల్లంఘనదారులను కట్టడి చేయడమే కాకుండా నేరాలను అదుపు చేయడం, నేరాలను ఛేదించడంలో కూడా తమ వంతు సహకారాన్ని పోలీసులకు సాంకేతిక పరంగా అందిస్తున్నాయి.
కూడళ్లలో నిరంతర నిఘా
కొన్ని చౌరస్తాల్లో ట్రాఫిక్ సిబ్బంది కనిపిస్తేనే చాలా మంది వాహనదారుల నిబంధనలు పాటిస్తుంటారు. ట్రాఫిక్ సిబ్బంది కనిపించని చౌరస్తాల్లో సిగ్నల్స్ను కూడా పట్టించుకోకుండానే దూసుకుపోతున్నారు. ఇలాంటి పరిస్థితుల నుంచి బయటపడేందు కోసమే ప్రతి కూడలిలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. గత కొన్నేండ్లుగా ట్రాఫిక్ క్రమబద్ధీకరణలో ట్రాఫిక్ పోలీసులు సాంకేతికతను ఉపయోగిస్తున్నారు. ట్రాఫిక్ నిబంధనలు మన కోసమే.. అనే విషయాన్ని కొందరు మరిచిపోతూ నిబంధనలను ఉల్లంఘిస్తున్నారు. ఇలాంటి ఉల్లంఘనదారులపై నిరంతరం నిఘా ఉంచడంలో భాగంగానే కెమెరాలు ఏర్పాటయ్యాయి. కూడలిలో సిబ్బందితో పాటు నిఘా నేత్రలు ఉన్నాయన్న విషయాన్ని ప్రతి వాహనదారుడు గమనించాలి.