వనస్థలిపురం, ఏప్రిల్ 16: పార్క్ చేసిన కారు అద్దం పగులగొట్టి ఇద్దరు వ్యక్తులు రూ.5 లక్షలు చోరీ చేశారు. ఈ ఘటన వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. బాధితులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చైతన్యపురిలో నివాసముండే ఎం.నర్సింహ ఎల్బీనగర్ సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్లో శుక్రవారం మధ్యాహ్నం ఓ ప్లాటు రిజిస్ట్రేషన్ చేయించాడు. ఇందులో భాగంగా వచ్చిన రూ.5 లక్షలను తన కారు (టీఎస్07హెచ్డీ3555)లో పెట్టుకున్నాడు. అక్కడి నుంచి జడ్జస్ కాలనీకి వెళ్లాడు. కాలనీలోని రోడ్ నెంబర్ 5లో కారును పార్క్ చేసి కొంతదూరంలో ఉన్న ఓ ఇంటికి వెళ్లాడు. తిరిగి వచ్చి చూడగా కారు వెనుక వైపు ఉన్న అద్దం పగిలి ఉంది. కారు డోర్ ఓపెన్ చేసి చూడగా నగదు కనిపించలేదు. వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వగా ఘటనాస్థలానికి చేరుకొని దర్యాప్తు ప్రారంభించారు. చోరీ జరిగిన తీరును పరిశీలించారు. స్థానికంగా ఉన్న సీసీ కెమెరాలను పరిశీలించగా.. సబ్ రిజిస్ట్రార్ ఆఫీసు నుంచే వెంబడించిన ఇద్దరు వ్యక్తుల్లో ఒకరు పల్సర్పై.. మరొకరు నడుచుకుంటూ వచ్చి ఈ చోరీకి పాల్పడినట్లు గుర్తించారు. కారులో డబ్బులు దాచిన విషయాన్ని గమనించే పక్కా ప్లాన్తో ఈ దోపిడీ చేశారని ప్రాథమిక అంచనాకు వచ్చారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.