సిటీబ్యూరో, అక్టోబర్ 21(నమస్తే తెలంగాణ): ఎన్నికల నియమావళిలో భాగంగా శనివారం ఫ్లయింగ్ స్కాడ్ రూ.3లక్షల నగదును సీజ్ చేసిందని జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్ రాస్ ఒక ప్రకటనలో తెలిపారు. ఫ్లయింగ్ స్వాడ్ ద్వారా ఇప్పటి వరకు రూ.1,15,03,970 నగదు, పోలీసు అథారిటీ ద్వారా రూ.1,78,17,148 సీజ్ చేయగా.. మొత్తం రూ.37,23,30,006 నగదు సీజ్ చేశామని పేర్కొన్నారు. లా అండ్ ఆర్డర్ కింద లైసెన్స్ ఆయుధాలను ఇప్పటి వరకు 4,316 సేకరించారని, సీఆర్పీసీ కింద శనివారం 51 కేసులు నమోదు కాగా, ఇప్పటి వరకు 444 కేసులు నమోదయ్యాయి. శనివారం 134 మందిని బైండోవర్ చేయగా, ఇప్పటి వరకు మొత్తం 1215 మందిని బైండోవర్ చేశామన్నారు. ఎంసీసీ ఉల్లంఘన కింద గోడలపై ఉన్న రాతలను, పోస్టర్లను ఇప్పటి వరకు 67330 తొలగించామని, అదేవిధంగా రాజకీయ నాయకుల విగ్రహాలకు మాస్కులు వేయడం జరిగిందని, ఇందులో సుమారు 72,704 విగ్రహాలున్నాయని తెలిపారు. అనుమతి లేకుండా సభలు, సమావేశాలపై శనివారం ఒక కేసు నమోదు కాగా, ఇప్పటి వరకు 9 కేసులు నమోదు చేశామని పేర్కొన్నారు. ఎక్సైజ్ శాఖ ద్వారా ఈరోజు 308 లీటర్ల లిక్కర్ను సీజ్ చేయగా, మొత్తం 5397 లీటర్ల లిక్కర్ను సీజ్ చేశామని జిల్లా ఎన్నికల అధికారి రొనాల్డ్ రాస్ వెల్లడించారు.