సిటీబ్యూరో, మార్చి 20 (నమస్తే తెలంగాణ): ప్రజల ఆరోగ్యానికి హానికరమైన కాల్షియం కార్బైడ్ను వినియోగిస్తూ.. కృత్రిమ పద్ధతిలో మామిడి పండ్లను మాగ బెడుతున్న గోదాములపై హైదరాబాద్ టాస్క్ఫోర్స్ పోలీసులు, జీహెచ్ఎంసీ ఫుడ్ సేఫ్టీ అధికారులు కలిసి దాడులు చేశారు. ఈ దాడుల్లో ఆరు గోదాముల్లో నిబంధనలకు విరుద్ధంగా కృత్రిమ పద్ధతిలో మామిడి పండ్లను మాగబెడుతున్నట్లు బయటపడింది. దీంతో ఐదు వ్యాపార సంస్థలపై క్రిమినల్ కేసులు నమోదు చేసినట్లు టాస్క్ఫోర్స్ డీసీపీ రష్మీ పెరుమాళ్ వెల్లడించారు.
జీహెచ్ఎంసీ అధికారులతో కలిసి బుధవారం సీసీఎస్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. మంగళ్హాట్లో జాలీ హనుమాన్ పండ్ల వ్యాపారి రామేశ్వర్, ఆసిఫ్నగర్లో న్యూ లిబర్టీ ఫ్రూట్ షాప్ యజమాని ఇర్ఫాన్ ఖాన్, లక్కీ ఫ్రూట్ షాప్ యజమాని మహ్మద్ హుస్సేన్, బహదూర్పురాలో జలాల్ మియా ఫ్రూట్ గోదాం యజమాని సయ్యద్ జహూర్, పండ్ల వ్యాపారులైన చార్మినార్కు చెందిన సయ్యద్ మస్తాన్, భవానీనగర్కు చెందిన సయ్యద్ అస్లం, మొఘల్పురాకు చెందిన సయ్యద్ సుదుల్లా ఇండ్లు, గోదాంలలో దాడులు చేసినట్లు తెలిపారు.
వీరు నిబంధనలకు విరుద్ధంగా పండ్లను మాగ పెట్టేందుకు ఎథిలైన్, కాల్షియం కార్బైడ్, కాల్షియం ఎసిటిలైడ్ వంటి కెమికల్స్ను ఉపయోగిస్తున్నట్లు గుర్తించి, వారిపై స్థానిక పోలీసు స్టేషన్లలో కేసులు నమోదు చేయించినట్లు వివరించారు. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఎఫ్ఎస్ఎస్ఏఐ) నిబంధనలకు విరుద్ధంగా కెమికల్స్ వాడుతున్నట్లు గుర్తించామన్నారు. వేసవిలో మామిడి పండ్ల సీజన్ కావడంతో ప్రజల ఆరోగ్యానికి హానికరంగా మారే కెమికల్స్తో పండ్లను మాగ పెట్టవద్దని డీసీపీ సూచించారు. నిబంధనలకు విరుద్ధంగా కెమికల్స్ వాడటం వల్ల ప్రజలకు చర్మ, ఊపిరితిత్తులు.. తదితర ఆరోగ్య సమస్యలు వస్తాయన్నారు.
జీహెచ్ఎంసీ అధికారులు మాట్లాడుతూ.. నిబంధనలకు విరుద్ధంగా కృత్రిమంగా పండ్లను మాగ పెట్టేందుకు ప్రయత్నిస్తే సెక్షన్ 59 ప్రకారం జైలు శిక్ష ఉంటుందన్నారు. కాల్షియం కార్బైడ్ ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపయోగించవద్దని జీహెచ్ఎంసీ పుడ్ కంట్రోల్ విభాగం డిప్యూటీ కమిషనర్ బాలాజీ వెల్లడించారు. ఎక్కడైనా నిబంధనలకు విరుద్ధంగా పండ్లను మాగ పెట్టడం, కల్తీ ఆహార పదార్థాలు విక్రయించినట్లు ప్రజల దృష్టికి వస్తే జీహెచ్ఎంసీ 040-21111111 కంట్రోల్ నంబర్కు ఫిర్యాదు చేయాలని సూచించారు. ఈ సమావేశంలో టాస్క్ఫోర్స్ అదనపు డీసీపీ అందె శ్రీనివాసరావు, ఇన్స్పెక్టర్లు బాలస్వామి, షేక్ జకీర్ హుస్సేన్, నాగార్జున తదితరులు పాల్గొన్నారు.