Hyderabad |బంజారాహిల్స్, ఫిబ్రవరి 25: రద్దీరోడ్డుపై రాంగ్రూట్లో రావడమే కాదు.. అడ్డుకున్న ట్రాఫిక్ హోంగార్డుపై అనుచిత వ్యాఖ్యలు చేసి.. దాడి చేసిన మహిళపై బంజారాహిల్స్ పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేశారు. బంజారాహిల్స్ ట్రాఫిక్ పీఎస్కు చెందిన హోంగార్డు విఘ్నేష్ శనివారం రాత్రి రోడ్ నం. 12లోని అగ్రసేన్ చౌరస్తాలో విధులు నిర్వహిస్తున్నారు. అదే సమయంలో ఓ మహిళ తన కారులో రాంగ్రూట్లో వేగంగా దూసుకు వస్తుండడాన్ని గమనించిన హోంగార్డు విఘ్నేష్ ఆపారు. రద్దీ రూట్లో రాంగ్రూట్లో కారు వస్తే ప్రమాదాలు జరుగుతాయని, కారును వెనక్కి తిప్పాలని సూచించారు.
అయితే రాంగ్రూట్లో వెళ్లినందుకు తన కారు ఫొటోలు తీసుకుని చలానా వేసుకోవాలని, తాను మాత్రం ముందుకే వెళ్తానంటూ కారులోని మహిళ వాగ్వాదానికి దిగింది. అయితే కారును ముందుకు వెళ్లనిచ్చేది లేదంటూ విఘ్నేష్ చెప్పడంతో రెచ్చిపోయిన మహిళ.. కారులోంచి బయటకు దిగి తీవ్రపదజాలంతోదూషించడంతో పాటు దాడి చేసి లైఫ్ జాకెట్ను చింపేసి మొబైల్ ఫోన్ను పగలగొట్టింది. బాధితుడు విఘ్నేష్ ఇచ్చిన ఫిర్యాదుతో నిందితురాలిపై ఐపీసీ 332, 353, 427, 504, 279తో పాటు పీడీపీపీ యాక్ట్, ఎంవీ యాక్ట్స్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.