బంజారాహిల్స్,మే 19 : కేసుకు సంబంధించి రాజీ విషయంలో చోటు చేసుకున్న వాగ్వాదంలో ఓ యువకుడిపై కత్తితో దాడి చేసిన ఘటన బంజారాహిల్స్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. బంజారాహిల్స్ రోడ్ నెం 3లోని షౌకత్నగర్కు చెందిన ఐమన్ పాషా(22) అనే యువకుడికి మౌలాలిలో నివాసం ఉంటున్న ఫయాజ్ (23) అనే యువకుడితో స్నేహం ఉంది. గతంలో వీరిద్దరూ కలిసి ఓ వ్యక్తిపై దాడి చేసిన ఘటనపై కేసు నమోదయింది. సోమవారం రాత్రి వీరిద్దరూ మద్యం సేవించి బంజారాహిల్స్ రోడ్ నెం 3లో బైక్మీద వెళ్తున్నారు.
గతంలో నమోదయిన కేసులో రాజీ పడితే బాగుంటుందని ఐమన్ పాషా సూచించడంతో ఇద్దరి మద్యన వాగ్వాదం ప్రారంభమయింది. దీంతో ఆగ్రహానికి లోనయిన ఫయాజ్ తనచేతిలోని కత్తితో ఐమన్ పాషాపై దాడి చేయడంతో మెడకు స్వల్పగాయమయింది. ఈ మేరకు బాధితుడు బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.