YS Sharmila | హైదరాబాద్ : వైఎస్ షర్మిలపై బంజారాహిల్స్ పోలీసు స్టేషన్లో కేసు నమోదైంది. షర్మిలపై ఐపీసీ 332, 353, 509, 427 సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. సిట్ కార్యాలయానికి బయల్దేరిన వైఎస్ షర్మిల కారును ఆపేందుకు యత్నిస్తుండగా, కానిస్టేబుల్ గిరిబాబుపై కారును ఎక్కించారు. పోలీసులపై షర్మిల దాడి చేశారు. అయితే కారు ఎక్కించడంతో గాయపడ్డ గిరిబాబును స్టార్ ఆస్పత్రికి తరలించారు. స్కానింగ్ చేయగా, కాలి లిగ్మెంట్కు గాయం అయినట్లు వైద్యులు తెలిపారు. ఈ క్రమంలో బాధిత పోలీసుల ఫిర్యాదు మేరకు బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు.
సోమవారం ఉదయం లోటస్పాండ్లోని తన నివాసం నుంచి బయల్దేరిన వైఎస్ షర్మిలను పోలీసులు అడ్డుకున్నారు. సిట్ కార్యాలయానికి వెళ్తున్నారనే సమాచారంతో ఉద్రిక్తతలు చోటు చేసుకోకుండా చూసేందుకు ఆమెను బయటకు రాకుండా నిలిపివేశారు. దీంతో పోలీసులతో వైఎస్ షర్మిల వాగ్వాదానికి దిగారు. ఆమెను అడ్డుకునేందుకు యత్నించిన ఎస్సై, మహిళా కానిస్టేబుల్ను చేతితో పక్కకు నెట్టేశారు. వారితో దురుసుగా ప్రవర్తించారు. అంతేకాకుండా అక్కడే రోడ్డుపై బైఠాయించారు. ఈ క్రమంలో లోటస్పాండ్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొనడంతో వైఎస్ షర్మిలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆమెను అరెస్టు చేసి జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్కు తరలించారు.