కేఎల్ యూనివర్సిటీ బిజినెస్ స్కూల్ ప్రొఫెసర్ గీత
బీబీఏ, బీపీఏ, బీకాం, ఎంబీఏ లాంటి కోర్సులను అందిపుచ్చుకోవాలి
కేఎల్ యూనివర్సిటీ- నమస్తే తెలంగాణ- తెలంగాణ టుడే ఆధ్వర్యంలో
విద్యార్థులకు అవగాహన సదస్సు
సిటీబ్యూరో, ఏప్రిల్ 25(నమస్తే తెలంగాణ): బిజినెస్, మేనేజ్మెంట్ కోర్సులకు ఉత్తమ వేదిక కేఎల్ బిజినెస్ స్కూల్ అని, ప్రపంచీకరణ ద్వారా వ్యాపార విస్తరణ మరింత వేగవంతం అవుతున్న తరుణంలో శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థవంతంగా వినియోగించుకొని విద్యార్థులు పోటీ ప్రపంచంలో రాణించాలని కేఎల్ డీమ్డ్ యూనివర్సిటీ బిజినెస్ స్కూల్ ప్రొఫెసర్ గీత అన్నారు. ‘డిగ్రీ తర్వాత ఉన్నత విద్యావకాశాలు’ అనే అంశంపై లక్డీకాపూల్లోని ఐఐఎంసీ (ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ అండ్ కామర్స్) కళాశాలలో “కేఎల్ యూనివర్సిటీ – నమస్తే తెలంగాణ – తెలంగాణ టుడే” ఆధ్వర్యంలో అవగాహన సదస్సును సోమవారం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన ప్రొఫెసర్ గీత మాట్లాడుతూ.. విద్యార్థి దశలోనే ఉత్తమంగా అభ్యసించే అంశాలను ఎంచుకోవాలని సూచించారు. త్వరలోనే అత్యున్నత ప్రమాణాలతో హైదరాబాద్లోని కొండాపూర్లో ‘కేఎల్’ గ్లోబల్ బిజినెస్ స్కూల్ ఏర్పాటు కానున్నట్లు ఆమె తెలిపారు.
ఈ బిజినెస్ స్కూల్లో ఐఐఎం ప్రొఫెసర్లు, పారిశ్రామిక నిష్ణాతులతో పాఠాలు చెప్పిస్తున్నామని పేర్కొన్నారు. విద్యార్థులు డిగ్రీ చేసిన తర్వాత ఎంబీఏ లాంటి కోర్సుల్లో చేరడానికి ఉత్తమమైన వేదికలుగా కేఎల్ డీమ్డ్ యూనివర్సిటీతో పాటు ‘కేఎల్’ గ్లోబల్ బిజినెస్ స్కూల్ నిలుస్తుందని ఆమె చెప్పారు. సమకాలీన కార్పొరేటర్ ప్రపంచానికి సిసలైన నాయకులను అందించే లక్ష్యంగా ప్రపంచ స్థాయి విద్యా ప్రణాళిక ఉంటుందని పేర్కొన్నారు. ఇందులో అత్యాధునిక మౌలిక వసతులు, బోధనా తరగతులు ఉంటాయన్నారు.
బిజినెస్ స్కూల్ ప్రత్యేకతలు..
బిజినెస్ మేనెజ్మెంట్ కోర్సులు చదివే విద్యార్థులకు సాధారణ విద్యా బోధన వల్ల కేవలం పుస్తక పరిజ్ఞానం మాత్రమే లభిస్తున్నదని, అయితే, కేఎస్ బిజినెస్ స్కూల్ బోధనా విధానంలో పరిశ్రమలలో పని చేస్తూ నైపుణ్యం పొందేలా ఉంటుందని ప్రొఫెసర్ గీత తెలిపారు. ప్రాక్టికల్గా శిక్షణ ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. పరిశ్రమల్లో వివిధ విభాగాల్లో నిర్వహించే, నిర్వహించాల్సిన విధి విధానాలను విద్యార్థులకు ప్రత్యక్షంగా చూపుతూ బోధన చేస్తారని ఆమె వివరించారు. కార్పొరేట్ ప్రపంచంలో వినియోగించే వాస్తవ ప్రణాళికలను పాఠ్యంశాలుగా బోధించడం బిజినెస్ స్కూల్ విద్యా విధానంలో ప్రధానమైనదని, విద్యార్థుల్లో కమ్యూనికేషన్ నైపుణ్యం పెంపొందేలా ప్రత్యేక శిక్షణ ఇస్తారని చెప్పారు. మే 8, 9, 10 తేదీల్లో కేఎల్ యూనివర్సిటీ మేజేజ్మెంట్ ఆప్టిట్యూడ్ టెస్ట్(మ్యాట్) పరీక్ష నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో నమస్తే తెలంగాణ ఏజీఎం (అడ్వైర్టెజ్మెంట్ విభాగం) పి.రాములు, కేఎల్ యూనివర్సిటీ మార్కెటింగ్ రీజినల్ మేనేజర్ రాజేశ్, అడ్మిషన్ మేనేజర్స్ దిలీప్ కుమార్, సుధీర్, వెంకటేశ్, ఐఐఎంసీ కళాశాల ప్రిన్సిపాల్ కె.రఘువీర్, వైస్ ప్రిన్సిపాల్స్ తిరుమలరావు, సరిత, తదితరులు పాల్గొన్నారు. అడ్మిషన్స్, ఎగ్జామ్స్ వివరాలకు 7997 9 98380, 799 79 98378, 95 503 44777 నంబర్లలో సంప్రదించాలని విద్యార్థులకు సూచించారు.
బిజినెస్ మేనేజ్మెంట్ కోర్సులు అభ్యసించాలి
ప్రజల ఆలోచనలు, అవసరాలు, అభిరుచులకు అనుగుణంగా కార్పొరేట్ కంపెనీలు నూతన ఉత్పత్తులతో వినియోగదారులను ఆకట్టుకుంటున్న తరుణమిదని ప్రొఫెసర్ గీత అన్నారు. ప్రపంచీకరణ ద్వారా వ్యాపార విస్తరణ మరింత వేగవంతం అవుతోందని, ఈ నేపథ్యంలో బిజినెస్ మేనేజ్మెంట్ కోర్సులు అభ్యసించాల్సిన అవసరం ఎంతో ఉందన్నారు. దేశీయంగా కార్పొరేట్ రంగం వేగంగా విస్తరిస్తున్న తరుణంలో ఇలాంటి అవగాహన సదస్సులు విద్యార్థులకు ఎంతగానో తోడ్పడతాయని అభిప్రాయపడ్డారు. ఆధునికతకు డిజిటలైజేషన్ తోడవటంతో సరికొత్తగా, శరవేగంగా కార్పొరేట్ రంగం అన్ని వర్గాలకు చేరువవుతున్నదని, ఇందుకు సమర్థులైన, నిష్ణాతులైన యువతకు కార్పొరేట్ ప్రపంచం ఆకర్షణీయమైన ప్యాకేజీలతో ‘రెడ్ కార్పెట్’ పరిచి ఆహ్వానిస్తున్నాయని అన్నారు. బిజినెస్ మేనేజ్మెంట్ రంగంలో విస్తృతమైన ఉద్యోగ అవకాశాలు, ఔత్సాహికులకు సైతం మెరుగైన అవకాశాలు ఉన్నాయని గుర్తు చేశారు.
బిజినెస్ మేనేజ్మెంట్ కోర్సులకు కేఎల్ గ్లోబల్ వేదిక..
న్యాక్ ప్లస్, ప్లస్ గ్రేడ్తో పాటు యూజీసీ కేటగిరీ 1 హోదాను కేఎల్ వర్సిటీ పొందిందని, సమగ్ర, సౌలభ్యమైన విద్యా విధానంతో జాతీయస్థాయిలో ప్రముఖ విద్యాసంస్థగా వెలుగొందుతున్నదని చెప్పారు. మారుతున్న కాలానికి అనుగుణంగా ఎప్పటికప్పుడు విద్యా ప్రణాళికలను రూపొందిస్తూ.. అనుభవం కలిగిన ప్రొఫెసర్లతో ఆధునిక పరిజ్ఞానం ద్వారా విద్యా బోధన చేస్తూ క్యాంపస్ ప్లేస్మెంట్ ద్వారా నూరు శాతం ప్లేస్మెంట్స్ లభించేలా స్పష్టమైన కార్యాచరణను అవలంబిస్తున్నదని పేరొన్నారు. బిజినెస్, మేనేజ్మెంట్ కోర్సులను అభ్యసించే విద్యార్థులకు ‘బిజినెస్ స్కూల్’ విద్యా ప్రణాళిక, విద్యా విధానంతో బీబీఏ, ఎంబీఏ, బీకాం వంటి కోర్సులను ప్రారంభిస్తున్నదని చెప్పారు.
కేరీర్పై మంచి అవగాహన కలిగింది
టెన్త్, ఇంటర్ తర్వాత గ్రాడ్యుయేషన్ ఎంతో కీలకం. దాని తర్వాత కేరీర్పై కొంత ఆలోచించుకోవాల్సి ఉంది. ఈ సదస్సు విద్యార్థులకు ఎంతగానో దోహదపడింది. ప్రొఫెసర్ గీత డిగ్రీ తర్వాత అవకాశాలను చక్కగా వివరించింది. అత్యంత ప్రభావవంతమైన వ్యక్తుల ఏడు అలవాట్లను ఈ సదస్సులో వివరించారు. దీని ద్వారా వృత్తిపరమైన, వ్యక్తిగత జీవితంలో విజయవంతమైన వ్యక్తిగా మారడానికి గీత గారి ఉపదేశం ఎంతో ప్రేరణను కలిగించాయి. భవిష్యత్ కేరీర్ లక్ష్యాలపై ఈ సదస్సు ద్వారా తగినంత జ్ఞానం, అవగాహన కలిగింది. అందుకు నిర్వాహకులకు కృతజ్ఞతలు.
– అనిరుధ్, బీకాం సీఎం (తృతీయం), ఐఐఎంసీ కళాశాల
కేరీర్పై క్లారిటీ వచ్చింది
డిగ్రీ తర్వాత ఏం చదువుకోవాలో అనేది ఆలోచించుకోవాల్సి ఉంది. ఐఐఎంసీ కాలేజ్లో జరిగిన ఈ సదస్సుతో ఓ క్లారిటీ వచ్చింది. కేరీర్ను ఎంచుకోవడంలో అనుమానాలు నివృత్తి అయ్యాయి. డిగ్రీ తర్వాత నేను వేయాల్సిన అడుగుల దశలను చక్కగా వివరించారు. జీవితంలో ఎలా విజయం సాధించాలో ఈ సదస్సు ప్రధానంగా వివరించింది. వక్తల ప్రసంగాలు నా బంగారు భవిష్యత్ను నిర్మించుకోవడంలో ఎంతో దోహదపడుతాయి. నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే, కేఎల్ విశ్వవిద్యాలయాల యాజమాన్యాలకు కృతజ్ఞతలు.
– మాధవి, బీఎస్సీ, మూడో సంవత్సరం
బంగారు భవిత నిర్మాణానికి దోహదం
డిగ్రీ తర్వాత ఏం చేయాలన్న దానిని సదస్సు స్పష్టంగా వివరించింది. కేరీర్ను అభివృద్ధి చేసుకోవాలంటే వ్యక్తిగత దృష్టి, నాయకత్వం, వ్యక్తిగత నిర్వహణ, గెలుపు ఆలోచన, సంభాషణ, సృజనాత్మక సహకార, స్వీయ రివైవల్ సూత్రాలను సదస్సులో వివరించిన తీరు అద్భుతంగా ఉంది. ఆ సూత్రాలే ఉన్నతమైన కేరీర్కు దోహదపడుతుందన్న నమ్మకాన్ని ఈ సదస్సు పెంచింది. భవిష్యత్ను ఎంచుకునేందుకు స్పష్టత లభించింది. ‘థ్యాంక్స్ టు నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే, కేఎల్ యూనివర్సిటీ, ఐఐఎంసీ కాలేజ్).
– దీపికా వ్యాస్, బీకాం (ఆనర్స్), మూడో సంవత్సరం
అర్థవంతంగా.. నిపుణుల ప్రసంగాలు
డిగ్రీ తర్వాత కోర్సులు, అందులో ఉన్న అవకాశాలును విద్యా నిపుణులు సరళంగా వివరించారు. ఏ కోర్సు చేస్తే భవితవ్యం ఎలా ఉంటుందన్న దానిని అర్థవంతంగా వివరించారు. ఎన్నో అవకాశాలు ఉన్నాయని ఈ సదస్సు ద్వారా తెలుసుకున్నాను. జీవితంలో ఉన్నత స్థాయిలో స్థిరపడాలంటే ఎలాంటి కోర్సు చేయాలన్న దానిపై క్లారిటీ ఇచ్చారు. నిపుణుల ప్రసంగాలు ప్రేరణ కలిగించాయి.
– అమిత్, బీబీఏ, థర్డ్ ఇయర్