హిమాయత్నగర్, జూన్ 25: మొత్తం డబ్బులు చెల్లించినా కారు ఇవ్వకుండా తనను మోసం చేసిన షోరూం ఎండీపై చర్యలు తీసుకోవాలంటూ.. శనివారం బాధితుడు నారాయణగూడ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఎస్సై శిరీష తెలిపిన వివరాల ప్రకారం ఓల్డ్ అల్వాల్కు చెందిన శ్రీశైలం హైదర్గూడలోని యశోద కృష్ణా టయోటా షోరూంలో ఇన్నోవా క్రిస్టా కారు కొనుగోలు చేసేందుకు ఏడాది కిందట బుకింగ్ చేసుకుని సగం డబ్బులు చెల్లించాడు.
ఈ ఏడాది జనవరిలో మిగిలిన మొత్తాన్ని కట్టేశాడు. అయినా కారును డెలివరీ చేయకపోవడంతో రెండు రోజుల కిందట శ్రీశైలం షోరూంకు రాగా, అక్కడ కనిపించలేదు. స్థానికులను అడగ్గా.. మూడు నెలల కిందటే షోరూం తరలించారని చెప్పడంతో కంగుతిన్నాడు. తనకు కారును డెలివరీ చేయడంలో నిర్లక్ష్యం వహించడమే కాకుండా మోసం చేసిన షోరూం ఎండీ మాగంటి మధు, జీఎం ఈశ్వర్లపై చర్యలు తీసుకోవాలని బాధితుడు శ్రీశైలం పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.