హైదరాబాద్: హైదరాబాద్ (Hyderabad) శివార్లలోని హయత్నగర్లో (Hayathnagar) విషాదం చోటుచేసుకున్నది. ఓ భవన నిర్మాణ కార్మికురాలు తన బిడ్డను నీడలో పడుకోబెడదామని భావించి పక్కనే ఉన్న అపార్ట్మెంట్లోని సెల్లార్కు (Apartment Cellar) తీసుకెళ్లింది. అక్కడ ఓ ఖాళీ స్థలంలో ఆ పాపను నిద్రపుచ్చింది. అనంతరం తన పని తాను చేసుకుంటూ ఉన్నది. అయితే ఆ అపార్ట్మెంట్కు చెందిన ఓ వ్యక్తి తనకు కేటాయించిన పార్కింగ్ ప్లేస్లో కారును (Car Parking) నిలిపేందుకు వచ్చాడు. ఈ క్రమంలో అక్కడే పడుకొని ఉన్న పాపను గమనించకపోవడంతో.. కారు ముందు టైరు ఆమె తలపైనుంచి వెళ్లింది. దీంతో తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతిచెందింది.
కర్ణాటకకు (Karnataka) చెందిన కవిత, రాజు అనే దంపతులు పొట్టకూటి కోసం హైదరాబాద్కు వలస వచ్చారు. గత మూడేండ్లుగా నగరంలో కూలిపనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వారికి ఏడేండ్ల వయస్సున్న కుమారుడు, మూడేండ్ల పాప లక్ష్మి ఉన్నారు. ఈ క్రమంలో హయత్నగర్లోని లెక్చరర్స్ కాలనీలో బాలాజీ ఆర్కేడ్ అపార్టుమెంటు పక్కన నిర్మాణంలో ఉన్న ఓ బిల్డింగ్లో శ్లాబు పనులు చేస్తున్నారు. దీంతో తమతోపాటు వచ్చిన లక్ష్మి నిద్రపోవడంతో.. తల్లి కవిత ఆమెను నీడకోసం పక్కనే ఉన్న అపార్టుమెంటు పార్కింగ్ ప్లేస్ పడుకోబెట్టింది. అయితే కొద్దిసేపటి తర్వాత అపార్టుమెంటులో నివసించే హరిరామకృష్ణ అనే వ్యక్తి తన కారును పార్క్ చేయడానికి సెల్లార్లోకి వచ్చాడు.
తన కేటాయించిన ప్లేస్లో పాప పడుకుని ఉందన్న విషయాన్ని గమనించని రామకృష్ణ.. కారును ముందుకు తీసుకొచ్చాడు. దీంతో ముందు టైరు ఆ పాపపైనుంచి వెళ్లింది. అయితే వెంటనే కారును వెనకకు తీసినప్పటికీ.. తీవ్రంగా గాయపడటంతో అక్కడికక్కడే మృతిచెందింది. గమనించిన తల్లి.. స్థానికుల సాయంతో దవాఖానకు తీసుకెళ్లింది. అయితే అప్పటికే ఆ చిన్నారని మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని కేసు నమోదుచేశారు. సీసీటీవీ దృశ్యాల ఆధారంగా కేసును దర్యాప్తు చేస్తున్నారు.