బండ్లగూడ, జూలై 12: ఒక వ్యక్తి సాహసం… సమయ స్పూర్తి కారు మంటల్లో చిక్కుకున్న ఇద్దరి చిన్నారుల ప్రాణాలు కాపాడింది. ఈ ఘటన పీవీ నరసింహా రావు ఎక్స్ప్రెస్వే పిల్లర్ నంబర్ 135 వద్ద జరిగింది. రాజేంద్రనగర్ ఏసీపీ సంజయ్కుమార్, ఇన్స్పెక్టర్ కనకయ్య, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ శ్యాంసుందర్రెడ్డి కథనం ప్రకారం.. మామిడిపల్లి గ్రామానికి చెందిన శైలజ తన మూడు నెలల బాబు, ఆరేండ్ల శ్రీహాన్, అక్క కొడుకు 12 ఏండ్ల విజయ్తో కలిసి సోమవారం 12గంటల సమయంలో హుందాయ్ కారులో ఇంటి నుంచి బంజారాహిల్స్ కేర్ దవాఖానకు బయల్దేరారు. పీవీ నరసింహారావు ఎక్స్ప్రెస్వే పైకి చేరుకోగానే కారులో రెడ్లైట్ గుర్తు వెలిగింది. అది ప్రమాద హెచ్చరికగా గుర్తించని ఆమె ముందుకుసాగింది. కారులో వైర్లు కాలినట్లుగా వాసన వస్తుందని చిన్నారులు చెప్పారు. దీంతో పిల్లర్ నంబర్ 135 వద్ద శైలజ కారు ఆపి, కిందకు దిగి చూసే లోపే ఒక్కసారిగా మంటలు ఎగిశాయి. వెంటనే ఆమె పక్క సీటులో ఉన్న చిన్నారిని తీసుకొని బయటకు వచ్చింది.
వెనక సీట్లో ఉన్న చిన్నారులను కాపాడేందుకు డోర్ తీసే ప్రయత్నం చేయగా.. డోర్ లాక్ అయ్యింది. దీంతో కంగుతిన్న ఆమె, చిన్నారులు బిగ్గరగా అరుస్తూ ఆర్తనాదాలు చేశారు. అదే సమయంలో అటుగా వెళ్తున్న మరో వాహనదారుడు రవి ప్రమాదాన్ని గమనించాడు. తన కారులో ఉన్న సామగ్రి సహాయంతో కారు అద్దాలను పగులగొట్టి శ్రీహాన్, విజయ్ని బయటకు తీసుకువచ్చాడు. ఇంతలోనే కారు పూర్తిస్థాయిలో దగ్ధమైంది. విషయం తెలుసుకున్న ఫైర్ సిబ్బంది అక్కడికి చేరుకొని మంటలను అదుపు చేశారు. సమాచారం అందుకున్న రాజేంద్రనగర్ ఏసీపీ సంజయ్కుమార్ సంఘటనా స్థలానికి చేరుకొని కారు ప్రమాదం జరిగిన తీరును పరిశీలించారు. అనంతరం బాధితుల నుంచి వివరాలు తెలుసుకున్నారు. కారు ప్రమాదం నుంచి చిన్నారులను కాపాడిన రవి సాహసానికి ఏసీపీ సంజయ్కుమార్ అభినందించారు.