మన్సూరాబాద్, జూన్ 2: కారు డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా రెండున్నరేండ్ల చిన్నారి మృతి చెందింది. ఎల్బీనగర్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్న ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఎస్సై రవికుమార్ కథనం ప్రకారం.. ఎల్బీనగర్లోని ఎన్టీఆర్నగర్ దర్గా సమీపంలో నివసించే హబీబుద్దీన్ 2018లో శశిరేఖను ప్రేమవివాహం చేసుకున్నాడు. ఈ దంపతులకు ధనలక్ష్మి (రెండున్నర సంవత్సరాలు) కూతురు ఉన్నది. హబీబుద్దీన్ డ్రైవర్. శశిరేఖ బ్యూటీషియన్. ఆన్లైన్ ద్వారా వచ్చే ఆర్డర్లతో కస్టమర్ల ఇంటికి వెళ్లి మేకప్ పనులు నిర్వహిస్తుంది. మన్సూరాబాద్, భవానీనగర్ కాలనీ నుంచి ఓ కస్టమర్ ఫోన్ చేయడంతో గురువారం వారి ఇంటికి వెళ్లింది. మేకప్ పనులు ముగించుకుని తన భర్తకు చెందిన పల్సర్ బైక్పై కూతురు ధనలక్ష్మితో కలిసి బయలుదేరారు. ఇదిలాఉండగా.. నాగోల్ బండ్లగూడకు చెందిన వినోద్కుమార్ వద్ద దురా ్గప్రసాద్ కారు డ్రైవర్గా పని చేస్తున్నాడు. దుర్గాప్రసాద్ డ్రైవింగ్ చేసుకుంటూ యజమాని వినోద్కుమార్ను కారులో తీసుకొని ఎస్కే గార్డెన్ సమీపంలో ఉన్న ఆర్కే కార్స్ వద్దకు వచ్చాడు. వినోద్కుమార్ పని నిమిత్తం గ్యారేజ్లోకి వెళ్లగా.. డ్రైవర్ దుర్గాప్రసాద్ కారులోనే కూర్చుని ఉన్నాడు. అదే సమయంలో హబీబుద్దీన్ దంపతులు తమ బైక్పై కూతుర్ని మధ్యలో కూర్చోబెట్టుకొని వెళ్తున్నారు. గురువారం మధ్యాహ్నం 12:30 గంటల సమయంలో ఆర్కే కార్స్ వద్ద నుంచి వీరు వెళ్తుండగా.. కారులో ఉన్న డ్రైవర్ దుర్గాప్రసాద్ ఒక్కసారిగా డోర్ను ఓపెన్ చేశాడు. కారు డోర్ బైక్కు తగలడంతో హబీబుద్దీన్, శశిరేఖతోపాటు చిన్నారి ధనలక్ష్మి ఒక్కసారిగా రోడ్డుపై పడిపోయారు. అదే సమయంలో వెనుక నుంచి వేగంగా వచ్చిన ఓ ఆటో చిన్నారిని ఢీకొట్టింది. దీంతో చిన్నారి ధనలక్ష్మి తలకు తీవ్రగాయాలయ్యాయి. శశిరేఖ కూడా స్వల్పంగా గాయపడింది. హబీబుద్దీన్కు ఎలాంటి గాయాలు కాలేదు. తీవ్రంగా గాయపడిన ధనలక్ష్మిని, స్వల్పంగా గాయపడిన శశిరేఖను ఎల్బీనగర్లోని కామినేని దవాఖానకు తరలించారు. చికిత్స పొందుతూ చిన్నారి ధనలక్ష్మి గురువారం మధ్యాహ్నం మృతి చెందింది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా దవాఖానకు తరలించారు. ప్రమాదానికి కారకుడైన డ్రైవర్ దుర్గాప్రసాద్ను పోలీసులు అరెస్ట్ చేసి, కారును సీజ్ చేశారు. ఎల్బీనగర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.