హిమాయత్నగర్, మే 6 : క్యాన్సర్ వ్యాధిని ఆరంభంలోనే గుర్తిస్తే చికిత్స అందించడం సులభతరం అవుతుందని గచ్చిబౌలి కిమ్స్ సన్షైన్ దవాఖాన సీనియర్ అంకాలజిస్ట్ డాక్టర్ కృపా బజాజ్ అన్నారు. సోమవారం హైదర్గూడలోని ఎన్ఎస్ఎస్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ మండుతున్న ఎండల వల్ల మనిషి శరీరంలో నీరు శాతం తగ్గుతుందని, వృద్ధులు ఎక్కువగా ఇబ్బందులు పడే అవకాశం ఉంటుందన్నారు. సరైన నిద్రతో పాటు మంచి ఆహారం, మజ్జిగ, కొబ్బరి నీరు, జావరూపంలో ఆహారం తీసుకోవాలన్నారు. కీమో థెరపీ, రెడియో థెరపీ తీసుకునే రోగులకు వేసవిలో వాంతులు, విరోచనాలు అయ్యే అవకాశం ఉంటుందని, నూతన చికిత్స విధానాలతో క్యాన్సర్ను కట్టడి చేయవచ్చన్నారు. ఈ నెల 12న మదర్స్ డే సందర్భంగా రొమ్ము క్యాన్సర్, వేసవిలో రోగులు తీసుకోవాల్సిన పలు అంశాలపై అవగాహన కల్పించి మహిళల్లో చైతన్యం తీసుకువచ్చేందుకు తమ వంతు కృషి చేయనున్నట్లు తెలిపారు. 40 ఏండ్లు దాటినా మహిళలకు అండాశయం, గర్భాశయ ముఖద్వారం, రొమ్ము క్యాన్సర్ ఎక్కువగా వచ్చే అవకాశం ఉందని, సకాలంలో వైద్యులను సంప్రదించి క్యాన్సర్కు సంబంధించిన రక్త పరీక్షలు, స్కాన్ చేసుకుని చికిత్స తీసుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో ప్రతినిధులు రసూలు, రంగస్వామి పాల్గొన్నారు.