బేగంపేట్, సెస్టెంబర్ 5: మారుతున్న జీవనశైలిపై అవగాహన లేకపోవడంతో క్యాన్సర్ ముప్పు తలెత్తుతున్నదని పరిశ్రమలు, వాణిజ్యం, ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ అన్నారు. యశోద ఆస్పత్రికి చెందిన ప్రముఖ సర్జికల్ అంకాలజిస్ట్ డాక్టర్ సచిన్ మార్డా రాసిన ‘అయామ్ అన్స్టాపబుల్’ పుస్తకాన్ని ఆదివారం బేగంపేట్ తాజ్ వివాంత హోటల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పాశ్చాత్య ఆహారపు అలవాట్లు, పెరుగుతున్న జనాభా, హానికరమైన వ్యసనాల ప్రభావం, జీవితం మధ్య సమతుల్యత లోపించడం వంటి కారణాలు క్యాన్సర్ వంటి ప్రమాదకర వ్యాధులకు కారణమవుతున్నాయన్నారు. క్యాన్సర్ వ్యాధిని ఎదుర్కోవాలంటే ప్రతి ఒక్కరికీ ఈ వ్యాధి పట్ల అవగాహన ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో రాచకొండ సీపీ మహేశ్ భగవత్, పుస్తక రచయిత డాక్టర్ మర్డా, యశోద ఆస్పత్రుల ఎండీ డాక్టర్ జీఎస్ రావు, డాక్టర్ గోరుకంటి పవన్ తదితరులు పాల్గొన్నారు.