సిటీబ్యూరో, అక్టోబర్ 16(నమస్తే తెలంగాణ) : హైదరాబాద్ జిల్లాలో వంద శాతం ఓటింగ్ నమోదుకు తుది ఓటరు జాబితాను ప్రక్షాళన చేశామని, ఇప్పటి వరకు మూడు లక్షల నకిలీ ఓట్లను రద్దు చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్ రాస్ తెలిపారు. సోమవారం జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం పన్వర్ హాల్లో ఓటింగ్ అవగాహన, ఎన్నికల నిర్వహణపై విలేకరుల సమావేశం నిర్వహించారు. తుది జాబితాతో సంబంధం లేకుండా అర్హులైన 18సం. వయస్సు నిండిన ఓటు హక్కును నమోదు చేసుకోవచ్చని సూచించారు. నూతన ఓటరు నమోదు, ఓటరు జాబితాలో పేర్లు తప్పులు, ఇల్లు షిఫ్ట్ అయిన వారు అక్టోబర్ 31వ తేదీ వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఉందన్నారు. ఓటరు జాబితా విడుదల చేశామని, అందులో పేరు ఉందో లేదో రీచెక్ చేసుకోవాలని సూచించారు. అందుకు టోల్ ఫ్రీ నంబర్ 1950, voter helpline app ద్వారా సరి చేసుకోవచ్చు లేదా voters.eci.gov.in వెబ్ సైట్ లేదా మీ దగ్గరలోని బీఎల్ఓలను సంప్రదించవచ్చన్నారు.
ఏఎస్డీ లిస్ట్లను తయారు చేస్తున్నాం
ఓటరు తుది జాబితా విడుదలైన తర్వాత అక్టోబర్ 9వ తేదీ నాటికి 44,680 డెత్, డూప్లికేట్ ఓట్లను తొలగించామని తెలిపారు. గత నాలుగు నెలల నుంచి ఒకే కుటుంబ సభ్యుల పేర్లు అదే నియోజకవర్గంలో వేర్వేరు పోలింగ్ స్టేషన్లలో ఉన్న 3,56,830 ఓట్లను సరిచేయడం జరిగిందని ఎన్నికల అధికారి తెలిపారు. నామినేషన్ ముగిసిన తర్వాత ఇంటింటికి వెళ్లి ఓటరు స్లిప్లను పంపిణీ చేస్తామని పేర్కొన్నారు. ఓటరు స్లిప్ పంపిణీ సందర్భంగా ఏఎస్డీ లిస్ట్లను తయారు చేస్తున్నామని, ఈ జాబితాను సంబంధిత ఆర్ఓలకు అందజేస్తామన్నారు. ఎన్నికల సందర్భంగా కొవిడ్ నిబంధనలు పాటించాల్సి ఉంటుందని చెప్పారు. పోలింగ్ బూత్ వద్ద వృద్ధులకు, దివ్యాంగులకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ఈ ఎన్నికల్లో 80 సంవత్సరాలు పైబడిన దివ్యాంగులకు ఇంటి నుండే ఓటు వేసే అవకాశం కల్పిస్తున్నామన్నారు. ఇప్పటికే ఫారం-12డీ అందజేసినట్లు తెలిపారు. ఆప్షన్ ఇచ్చిన తర్వాత పోలింగ్ స్టేషన్కు వచ్చి ఓటు వేయకూడదని స్పష్టం చేశారు.
లెక్కకు మించి నగదు తరలించవద్దు
నవంబర్ 3వ తేదీ నుంచి ఎన్నికల సంఘం ప్రత్యేక అబ్జర్వర్లు వస్తారని, అప్పటి నుంచి ఎస్ఎస్టీ టీమ్లను నియమించి పటిష్టమైన చర్యలు తీసుకుంటామని రొనాల్డ్ రాస్ తెలిపారు. ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలులో ఉన్నందున పౌరులు లెకకు మించి నగదును తీసుకెళ్లినచో సంబంధిత దృవ పత్రాలు తప్పనిసరిగా కలిగి ఉండాలని తెలిపారు. తనిఖీలో పట్టుబడిన సొమ్మును పరిశీలించడానికి హైదరాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో డిస్ట్రిక్ట్ గ్రీవెన్స్ సెల్ను ఏర్పాటు చేశామని చెప్పారు.
70 లక్షల నగదును సీజ్ చేశాం
ఎన్నికల ప్రవర్తన నియమావళిలో భాగంగా ఫ్లయింగ్ స్వాడ్ టీమ్లు ఇప్పటి వరకు 70 లక్షల నగదును సీజ్ చేసినట్లు తెలిపారు. పోలీసు సిబ్బంది రూ.18.9 కోట్లను సీజ్ చేయగా, 133 ఎఫ్ఐఆర్, 2,389 ఆయుధాల డిపాజిట్ చేసినట్లు చెప్పారు. లక్షా 50వేల వాల్ పెయింటింగ్, పోస్టర్ల తొలగింపు, 64,666 రాజకీయ నాయకుల విగ్రహాలను కప్పి ఉంచామన్నారు. 2,300 లీటర్ల లికర్ను స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. 128 కేసులు బుక్ చేశామని ఎన్నికల అధికారి తెలిపారు. ఈ సమావేశంలో డిప్యూటీ డీఈఓ అనుదీప్ దురిశెట్టి, హైదరాబాద్ జిల్లా అడిషనల్ కలెక్టర్ మధుసూదన్, అడిషనల్ కమిషనర్ శంకరయ్య, శరత్చంద్ర, డిప్యూటీ ఈఈ, అనంతం తదితరులు పాల్గొన్నారు.
మేడ్చల్లో 24 గంటలు నిఘా
మేడ్చల్ కలెక్టరేట్, అక్టోబర్ 16: ఎన్నికల నేపథ్యంలో ఎలాంటి అనుమతులు లేకుండా నగదు, మద్యం, బంగారం తరలింపుపై నిరంతరం పోలీసులు, ఎన్నికల అధికారుల ప్రత్యేక నిఘా కొనసాగుతున్నదని మేడ్చల్- మల్కాజిగిరి జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ గౌతమ్ అన్నారు. సోమవారం కలెక్టరేట్లో ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల విధి నిర్వహణలో పోలీసులు, ఎన్నికల అధికారులు నిరంతరం పని చేస్తున్నారని, ప్రతి రోజు పలు చోట్ల చెక్పోస్టులు ఏర్పాటు చేసి తనిఖీలు నిర్వహిస్తున్నారని అన్నారు. ఎన్నికల కోడ్ అమలు నుంచి సోమవారం వరకు నిర్వహించిన తనిఖీల్లో జిల్లాలో రూ.4,92,85,360 నగదు, రూ.3,04,66,728 విలువైన బంగారం, డైమండ్ ఆభరణాలు, 7,049 లీటర్ల మద్యం స్వాధీనం చేసుకొని సీజ్ చేసి, నమోదైన 179 కేసుల్లో 136 మందిని అరెస్టు చేసినట్లు కలెక్టర్ వివరించారు. మరోవైపు స్వీప్, ఫిర్యాదులు, ఎన్నికల ఖర్చులు, ఎన్ఐసీ, ఎంసీఎంసీ, ఎంసీసీ నోడల్ అధికారులతో ప్రత్యేకంగా సమీక్ష సమావేశం నిర్వహించారు.
డీఆర్సీ సెంటర్ పరిశీలన..
ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లలో భాగంగా రంగారెడ్డి జిల్లా కలెక్టర్ భారతి హోలీకేరి, అదనపు కలెక్టర్ ప్రతిమ సింగ్తో కలిసి ఎల్బీనగర్ నియోజకవర్గానికి సంబంధించిన డీఆర్సీ సెంటర్ను సోమవారం సరూర్నగర్ ఇండోర్ స్టేడియంలో పరిశీలించారు. ఈ పర్యటనలో ఆర్వో అండ్ జోనల్ కమిషనర్ పంకజా, డీసీపీ స్యాశ్రీ, ఏఈఆర్ఓ రవీందర్, సంబంధిత అధికారులు ఉన్నారు
గచ్చిబౌలి స్టేడియాన్ని పరిశీలించిన కలెక్టర్
గచ్చిబౌలి బాలయోగి క్రీడాస్టేడియాన్ని రంగారెడ్డి జిల్లా కలెక్టర్ భారతి హోళికేరి, అడిషనల్ కలెక్టర్ ప్రతిమాసింగ్, సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర సోమవారం పరిశీలించారు. వెస్ట్జోన్ కమిషనర్, ఆర్వో శ్రీనివాస్ రెడ్డి, మాదాపూర్ డీసీపీ సందీప్, వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు పాల్గొన్నారు.