Hyderabad | హైదరాబాద్ మియాపూర్లో సీఏ విద్యార్థి జనార్దన్ మృతిలో కీలక విషయాలు వెలగులోకి వచ్చాయి. బ్యాక్లాగ్లు ఉన్నాయనే మనస్తాపంతోనే అతను ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిసింది. సీఏ కోర్సు చదవడం తన వల్ల కావడం లేదని.. తల్లిదండ్రులు తనను క్షమించాలని రాసిన సూసైడ్ నోట్ బయటపడింది.
మియాపూర్లోని గోకుల్ ప్లాట్స్లో జనార్దన్ తన స్నేహితులతో ఉంటున్నాడు. సీఏ ఫైనల్ ఇయర్ చదువుతున్న జనార్దన్ రెండు సబ్జెక్టుల్లో ఫెయిల్ అయ్యాడు. దీంతో వాటికి సన్నద్ధం అయ్యేందుకు చెన్నై నుంచి హైదరాబాద్ వచ్చి ఉంటున్నాడు. కానీ ఇటీవల జరిగిన పరీక్షకు హాజరుకాలేదు. ఈ క్రమంలో శుక్రవారం అతని స్నేహితులంతా ఉద్యోగాలకు వెళ్లగా ఒంటరిగా ఉన్న సమయంలో జనార్దన్ నాలుక కోసుకుని.. ఆపై ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
సాయంత్రం ఇంటికి తిరిగొచ్చిన స్నేహితులు ఎన్నిసార్లు తలుపు కొట్టినా తీయకపోవడంతో స్థానికుల సాయంతో తలుపులు పగులగొట్టి లోపలికి వెళ్లారు. కానీ వారికి రక్తపు మడుగులో ఉరివేసుకున్న జనార్దన్ కనిపించాడు. ఇది చూసి కంగారుపడిపోయిన వారు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించిన పోలీసులు రెండు సూసైడ్ నోట్లను స్వాధీనం చేసుకున్నారు. వాటి ప్రకారం.. సీఏ కోర్సు చదవలేకపోతున్నానని.. తనను క్షమించాలని తల్లిదండ్రులకు లేఖ రాసి ఆత్మహత్య చేసుకున్నట్లుగా పోలీసులు నిర్ధారించారు.