సిటీబ్యూరో, సెప్టెంబర్ 12 ( నమస్తే తెలంగాణ ): నగరంలో ఆర్టీసీ బస్సుల రాకపోకలపై స్పష్టత కరువైంది. సమయానికి అనుగుణంగా బస్సులు నడపడానికి పలు రకాల సాంకేతిక సేవలు తీసుకొచ్చినా ఫలితం ఉండటం లేదు. ఫలితంగా ప్రయాణికుల సమయం బస్సు రాక కోసం ఎదురుచూడటంలోనే వృథా అవుతున్నది. బస్సుల రాకపోకల వివరాలకు గమ్యం యాప్ తీసుకొచ్చినా అది సాంకేతిక సమస్యతో సరైన సమాచారం చూపడం లేదు. ఇక డిపోల్లో ఏఐ సేవలు తీసుకొచ్చి బస్సు ఎప్పుడొస్తుంది? ఎక్కడ ఉంది? ఏ ప్లాట్ఫాంపై ఉంది తదితర సమాచారం తెలుస్తుందని అధికారులు ప్రణాళికలు చేసినప్పటికీ ఆ సేవలు ఇంకా అందుబాటులోకి రాలేదు.
ఆర్టీసీ బస్సుల సమాచారంపై స్పష్టమైన క్లారిటీ లేక చాలా మందికి ఎదురుచూపులు తప్పడం లేదు. ముఖ్యంగా రాత్రి సమయాల్లో బస్సుల సమాచారంపై ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రావాల్సిన బస్సులు ఒక్కోసారి రద్దు అవుతున్నాయి. ఆ బస్సు వస్తుందా? లేదా? అని చెప్పేవారు కూడా బస్టాప్ల్లో సిబ్బంది అందుబాటులో ఉండటం లేరని ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
నగర బస్సుల్లో డిజిటల్ చెల్లింపులు ప్రోత్సహించడానికి బండ్లగూడను పైలెట్ ప్రాజెక్టుగా తీసుకుని ఐటిమ్(ఇంటలిజెంట్ టికెటింగ్) మిషన్ల సేవలను ప్రారంభించారు. రెండు నెలల అనంతరం ఆ సేవలను నగరంలోని 70 శాతం బస్సుల్లో ప్రవేశపెట్టారు. క్యూఆర్ కోడ్, స్కైపింగ్తో టికెట్ తీసుకోవచ్చు. కానీ ఈ సేవలు ప్రస్తుతం 50 శాతం బస్సుల్లో అందుబాటులో లేవని ప్రయాణికులు వాపోతున్నారు. చిల్లర లేకపోతే దిగిపోవాల్సిన పరిస్థితి ఉందని చెబుతున్నారు. తరుచూ సర్వర్ సమస్య ఉందని చెబుతున్నట్టు పేర్కొన్నారు. నగరంలో సికింద్రాబాద్ -కొండాపూర్, సికింద్రాబాద్-కోఠి, ఉప్పల్-మెహిదీపట్నం తదితర మార్గాల్లో రాత్రి 9 దాటితే బస్సులు రావడం లేదని ప్రయాణికులు చెబుతున్నారు. కానీ ఆర్టీసీ అధికారులు మాత్రం సమస్య పరిష్కారం చేయకుండా కాలం వెల్లదీస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి.