Hyderabad | సిటీబ్యూరో/ కేపీహెచ్బీ కాలనీ, మార్చి 15: భవిష్యత్తు తరాల కోసం జల వనరులను రక్షించడం, ప్రస్తుత తరం బాధ్యత అని, చెరువులు, కుంటల అక్రమణ ఏ మాత్రం ఆమోదయోగ్యం కాదని అత్యున్నత న్యాయస్థానాలు ఆదేశాలు జారీ చేయడమే కాకుండా.. ఇటీవల నగరంలోని పలు చెరువుల కబ్జాలపై క్షేత్రస్థాయిలో పర్యటించాయి. ఈ పర్యటనలో అధికారుల వైఫల్యాలెన్నో అద్దం పట్టాయి. ఐనా అధికారుల వైఖరీలో ఏ మాత్రం మార్పు రావడం లేదు. కళ్ల ముందు అంతస్తుల మీద అంతస్తులు నిర్మిస్తూ చెరువు ఉనికిని ప్రశ్నార్థకం చేస్తున్నా.. అధికారులు అటువైపుగా వెళ్లడం లేదు.
పైగా సంబంధిత కబ్జాదారులు ఇచ్చే ముడుపులకు ఆశపడి చెరువుల అన్యాక్రాంతానికి ప్రత్యక్ష కారణమవుతున్నారు. ఈ నేపథ్యంలోనే కూకట్పల్లి కాముని చెరువు బఫర్ జోన్లో నిర్మించిన భవన కూల్చివేతలో సగటు పౌరుడు విజేతగా నిలిస్తే.., ఈ ఆక్రమణలో అధికారులు వ్యవహరించిన తీరుపై సర్వత్రా ఆరోపణలు అమితంగా వినిపిస్తున్నాయి. ప్రధానంగా జీహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ విభాగం అధికారుల పనితీరు పట్ల విమర్శలు వెలువెత్తుతున్నాయి. సంబంధిత అధికారులపై కమిషనర్ జోక్యం చేసుకొని చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
కూకట్పల్లి కాముని చెరువు బఫర్జోన్లో వెలిసిన రాఘవేంద్ర కాలనీలో జీరో పర్మిషన్తో భారీ భవన నిర్మాణం జరిగినా జీహెచ్ఎంసీ, రెవెన్యూ, ఇరిగేషన్ శాఖల అధికారులు చోద్యం చూడటం.., భవన నిర్మాణ పనులు చివరి దశకు చేరుకున్న దశలో ట్విట్టర్లో వచ్చిన ఫిర్యాదుతో ఆయా శాఖల అధికారులు స్పందించి హడావిడిగా ఆ భవనాన్ని కూల్చివేయడం పలు అనుమానాలకు తావిస్తోంది. కాముని చెరువు బఫర్జోన్లో వెలసిన రాఘవేంద్ర కాలనీలో మొదటగా చెరువు బఫర్ జోన్లో చిన్న చిన్న రేకుల రూములు నిర్మించి స్థలాలను ఆక్రమించారు. తదనంతరం, పక్కా భవన నిర్మాణాలు చేసుకుని దర్జాగా ఆ ఇంట్లో నివాసముండటం.. మరికొందరు లక్షలాది రూపాయలకు అమ్ముకోవడం పరిపాటిగా మారింది.
తాజాగా, రాఘవేంద్ర కాలనీలో ఓ వ్యక్తి ఆక్రమించిన స్థలం 240 గజాలలో ఆరు అంతస్తుల భవన నిర్మాణ పనులు చేపట్టాడు. కాలనీలు, బస్తీలలో అన్ని డాక్యుమెంట్లు సరిగా ఉన్నా స్థలాలలో ఎవరైనా ఇల్లు కట్టుకోవాలంటే ఆర్కెటెక్చర్ను సంప్రదించి భవన నిర్మాణానికి సంబంధించిన నమూనాను సిద్ధం చేసుకుని జీహెచ్ఎంసీ కార్యాలయంలో అనుమతి తీసుకొని నిర్మాణ పనులు చేపడతారు. కానీ.., రాఘవేంద్ర కాలనీలో చేపట్టిన ఈ నిర్మాణానికి ఎలాంటి అనుమతులు లేవు. జీరో పర్మిషన్తో భారీ భవన నిర్మాణం జరిగినా జీహెచ్ఎంసీ, ఇరిగేషన్, రెవెన్యూ శాఖల అధికారులు కనీసం కన్నెత్తి చూడలేదు.
కాముని చెరువు సమీపంలోని రాఘవేంద్ర కాలనీలో బఫర్జోన్లో ఎలాంటి అనుమతులు లేకుండా భారీ భవన నిర్మాణం జరుగుతుందని ఓ వ్యక్తి ట్విట్టర్లో జీహెచ్ఎంసీ, ఇరిగేషన్, ఇతర విభాగాల అధికారులకు ఫిర్యాదు చేశాడు. ఈ ఫిర్యాదు అందిన వెంటనే ఆయా శాఖల అధికారులు రంగంలోకి దిగి ఆ భారీ భవన నిర్మాణానికి చెందిన గోడలు, స్లాబులను కూల్చివేశారు. ఆరు అంతస్తులు అక్రమంగా నిర్మించినా సంబంధిత అధికారులు అటువైపు చూడకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది.
ఈ కాలనీలో ఇదే తరహాలో పలు భవనాలు ఎలాంటి అనుమతులు నిర్మిస్తున్నా ఏ అధికారి అక్కడికి వెళ్లి అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవడంలో వెనుకంజ వేస్తున్నారు. ఈ అక్రమ నిర్మాణదారులు స్థానికంగా అధికార పార్టీ నేతలు పేర్లు చెప్పుకుంటూ నిర్మాణాల దగ్గరికి అధికారులు వస్తే బెదిరింపులకు పాల్పడుతున్నట్లు ఓ అధికారి ఆవేదన వ్యక్తం చేశారు. కాముని చెరువును బఫర్జోన్లో వెలిసిన రాఘవేంద్ర కాలనీఆలో నిబంధనలకు విరుద్ధంగా జరుగుతున్న అక్రమ నిర్మాణాలన్నింటిపై చర్యలు తీసుకోవాలని ఓ వర్గం నేతలు అధికారులను కోరుతున్నారు.