Hyderabad | సిటీబ్యూరో, మార్చి 18 (నమస్తే తెలంగాణ) : ప్రణాళికబద్ధమైన పట్టణీకరణే లక్ష్యంగా హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్ఎండీఏ) చర్యలు చేపడుతున్నది. గ్రేటర్ చుట్టూ ఉన్న ఔటర్ రింగురోడ్డును దాటి శివారు ప్రాంతాల్లో పట్టణీకరణ జరుగుతున్న నేపథ్యంలో మెరుగైన మౌలికవసతుల కల్పనపై ప్రధాన దృష్టి సారించింది. తాజాగా రాజేంద్రనగర్ సమీపంలోని బుద్వేల్ రెవెన్యూ పరిధిలో సుమారు 180 ఎకరాల ప్రభుత్వ భూమిని లేఅవుట్ చేసేందుకు చర్యలు చేపట్టింది. ఒకవైపు ఔటర్ రింగు రోడ్డు, మరోవైపు హిమాయత్సాగర్ జలాశయం సమీపంలో ఈ లేఅవుట్ను అభివృద్ధి చేస్తుండడంతో ఎంతో ప్రాధాన్యత నెలకొంది.
ప్రభుత్వ భూములు కబ్జాకు గురి కాకుండా చేయడంతో పాటు ప్రభుత్వానికి ఆదాయం సమకూరేలా లేఅవుట్లను హెచ్ఎండీఏ చేపట్టి ఆన్లైన్లో విక్రయిస్తున్నది. ఇటీవలే బాచుపల్లి, మేడిపల్లిలో చేపట్టి హెచ్ఎండీఏ లేఅవుట్లోని ప్లాట్లకు విశేష స్పందన వచ్చింది. అదే తరహాలో బుద్వేల్లోని 180 ఎకరాలను లేఅవుట్ చేసి ఆన్లైన్ ద్వారా విక్రయించేందుకు ప్లానింగ్ విభాగం డ్రాఫ్ట్ లేఅవుట్ను సిద్ధం చేసింది. ఇప్పటికే గుట్టలతో కూడిన బుద్వేల్ భూమిని చదును చేసి, రోడ్లు, హద్దురాళ్లు ఏర్పాటు చేసేందుకు హెచ్ఎండీఏ టెండర్లు పిలిచింది. మరోవైపు హెచ్ఎండీఏ మాస్టర్ప్లాన్కు అనుగుణంగా రూపొందించి, ఆన్లైన్లోనే విక్రయించేందుకు ఎస్టేట్, ఇంజినీరింగ్ విభాగం అధికారులు చర్యలు చేపట్టారు. మార్చి 22న ఉగాది తర్వాత ఈ లేఅవుట్కు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ లేఅవుట్ వచ్చే నిధులతో పలు అభివృద్ధి కార్యక్రమాలు, నగర శివారు ప్రాంతాల్లో మౌలిక వసతులను కల్పించాలన్నది ప్రభుత్వ ఆలోచన అని అధికారులు తెలిపారు.
హైదరాబాద్ మహానగరాన్ని అన్ని రంగాల్లో గ్లోబల్ డెస్టినేషన్గా అభివృద్ధి చేయాలన్నది సీఎం కేసీఆర్ ఆలోచన. దానికి అనుగుణంగానే ప్రపంచ స్థాయి ప్రమాణాలతో కోర్ సిటీలోనే కాకుండా శివారు ప్రాంతాల్లోనూ అత్యంత మెరుగైన రోడ్ నెట్ వర్క్, అర్బన్ఫారెస్ట్ పార్కులు, ఇతర మౌలిక వసతులను కల్పిస్తున్నారు.