సిటీబ్యూరో, ఫిబ్రవరి 06 (నమస్తే తెలంగాణ ) : గత ప్రభుత్వాల హయంలో నిధుల కేటాయింపులో నిరాదరణకు గురయిన జలమండలి.. స్వరాష్ట్రంలో మాత్రం ఆత్మగౌరవంతో నిలుస్తున్నది. ప్రతి ఇంటికి సమృద్ధిగా తాగునీరు, వందకు వంద శాతం మురుగునీటి శుద్ధి లక్ష్యంగా ఈ ఏడాది కూడా ప్రభుత్వం బడ్జెట్లో జలమండలికి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చింది. 2023-24 సంవత్సర బడ్జెట్లో జలమండలికి రూ. 1960.70కోట్ల మేర నిధులను కేటాయించారు. ఇందులో సుంకిశాల ఇన్టేక్ పథకానికి రూ.725కోట్లు, కృష్ణా, గోదావరి పథకాల రుణాల చెల్లింపునకు రూ. 635.70కోట్లు, వివిధ అభివృద్ధి పనులకు రూ. 300కోట్లు, 20కెఎల్ ఉచిత తాగునీటి పథకానికి రూ. 300కోట్లు కేటాయించారు. ఐతే జలమండలి దాదాపు రూ.5,937కోట్ల ప్రతిపాదనలు ప్రభుత్వానికి సమర్పించగా..మెజార్టీ పథకాలకు గతంలో కంటే అదనంగా రూ.40.70కోట్ల మేర చెల్లింపులు జరిపారు. కాగా, 2021-22 ఆర్థిక సంవత్సరంలో రూ.2381 కోట్లు కేటాయించగా, 2022-23 సంవత్సరానికిగానూ రూ.1925 కోట్లు కేటాయించారు.
జలమండలికి నిధుల వరద
సిటీబ్యూరో, ఫిబ్రవరి 6 (నమస్తే తెలంగాణ): జలమండలికి బడ్జెట్లో అధిక ప్రాధాన్యతనిచ్చిన సీఎం కేసీఆర్కు జలమండలి ఇంజినీర్స్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు ధన్యవాదాలు తెలిపారు. ప్రజలకు సమృద్ధిగా నీరు అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్న సంస్థకు అండగా నిలిచి ప్రోత్సహిస్తున్నారని పేర్కొన్నారు. రూ.1960.70 కోట్లు కేటాయించడం హర్షణీయమన్నారు. నిర్ణీత వ్యవధిలో సుంకిశాల ఇన్టెక్, ఓఆర్ఆర్ ఫేజ్-2 తాగునీరు ప్రాజెక్టులు, 31 ఎస్టీపీల నిర్మాణ పనులను పూర్తి చేస్తామని తెలిపారు.
ఉచిత నీటి పథకానికి రూ.300కోట్లు
జీహెచ్ఎంసీ పరిధిలోని ప్రజలకు వరం లాంటి ఉచిత 20 వేల లీటర్ల మంచినీటి పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది. జీహెచ్ఎంసీ పరిధిలోని గృహ కనెక్షన్లు కలిగిన వినియోగదారులకు నెలకు 20 వేల లీటర్ల వరకు ఉచితంగా నీటిని అందించడం ఈ పథకం ఉద్దేశం. 2021 జనవరి 12వ తేదీన మున్సిపల్ శాఖ కేటీఆర్ బోరబండలోని ఎస్పీఆర్ హిల్స్, రహమత్ నగర్లో ఈ పథకాన్నిప్రారంభించారు. గతేడాది ఉచిత మంచినీటి సరఫరా కోసం రూ.550కోట్ల కేటాయించారు. తాజా బడ్జెట్లో మరో రూ.300కోట్ల మేర జలమండలికి ప్రభుత్వం నిధులు మంజూరు చేయనుంది. ఈ పథకంతో పేద మధ్య తరగతి ప్రజలపై వాటర్ బిల్లుల భారం తగ్గింది.
సుంకిశాలకు రూ.725 కోట్లు
కృష్ణా జలాల సరఫరాలో నగర వాసులకు పూర్తి స్థాయిలో భరోసా దక్కింది. హైదరాబాద్ ప్రజల భవిష్యత్తు తాగునీటి అవసరాలను దృష్టిలో పెట్టుకొని నాగార్జున సాగర్ సమీపంలోని సుంకిశాల నుంచి హైదరాబాద్కు నీటిని తరలించడానికి ప్రభుత్వం కొత్త ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది. రూ. 2,214కోట్ల ఖర్చు అవుతుందని అంచనా వేసి, ఇప్పటికే రూ.1450 కోట్లు కేటాయింపులు జరిపారు. తాజా బడ్జెట్లో రూ.725 కోట్లు కేటాయించారు. ఈ ఏడాది చివరి నాటికల్లా ఈ పథకాన్ని పూర్తి చేయడమే లక్ష్యంగా చర్యలు చేపడుతున్నారు.