హైదరాబాద్ : ఓ అబ్బాయి అడ్డదారిలో డబ్బు సంపాదించాలనుకున్నాడు.. అందుకు అమ్మాయిలా నటించాడు. ఓ వ్యాపారితో పరిచయం పెంచుకుని రూ. 45 లక్షలు దోచుకున్నాడు. ఈ ఘటన హైదరాబాద్లో వెలుగు చూసింది.
వివరాల్లోకి వెళ్తే.. కృష్ణా జిల్లాలోని నూజివీడుకు చెందిన మోతె అశోక్(28) ఇంజినీరింగ్ విద్యను మధ్యలోనే ఆపేశాడు. ఇక డబ్బు అవసరం పడడంతో అమ్మాయిలా అవతారమెత్తాడు. ఫేస్బుక్లో ఇందూష తుమ్మల అనే అమ్మాయి పేరుతో ఫేక్ అకౌంట్ను క్రియేట్ చేశాడు. ఇక జూబ్లీహిల్స్కు చెందిన వ్యాపారి ప్రవీణ్కు ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపగా, ఆయన అంగీకరించాడు. దీంతో అశోక్, ప్రవీణ్ మధ్య మంచి పరిచయం ఏర్పడింది. ఫేస్ బుక్ మేసేంజర్లో చాటింగ్ చేసుకోవడం ప్రారంభించారు.
ప్రవీణ్కు ఎలాంటి అనుమానం రాకుండా తాను అందంగా ఉన్నానని నమ్మించేందుకు అమ్మాయి ఫోటోలను కూడా పంపాడు. దీంతో తనతో మాట్లాడాలని ప్రవీణ్ అశోక్ను కోరడంతో.. అతను తెలివిగా తన మొబైల్లో వాయిస్ చేంజింగ్ యాప్ను డౌన్లోడ్ చేసుకున్నాడు. ఇక ఇరువురు మాట్లాడుకోవడం మొదలెట్టారు. అశోక్ తీయని మాటలకు ప్రవీణ్ కూడా పడిపోయాడు. అతను అడిగినప్పుడల్లా డబ్బు ఇవ్వడం ప్రారంభించాడు.
కాలేజీ ఫీజు కట్టాలని అశోక్ కోరడంతో రూ. 3 లక్షలు, అమ్మ కొవిడ్ బారిన పడిందని చెప్పడంతో రూ. 10 లక్షలు ప్రవీణ్ ఇచ్చాడు. తనకు కూడా కరోనా వచ్చిందని అశోక్ చెప్పడంతో ఒకేసారి రూ. 15 లక్షలు ఇచ్చాడు. ఇక కలవమంటే అశోక్ రాకపోవడంతో ప్రవీణ్కు అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు చేపట్టి అశోక్ను అరెస్టు చేశారు.