కవాడిగూడ, జూలై 31: పెన్షన్ సవరణ చేయడంలో కేంద్ర ప్రభుత్వం తీవ్ర జాప్యం చేస్తున్నదని ఆలిండియా బీఎస్ఎన్ఎల్, ఇంకా డాట్ పెన్షనర్స్ అసోసియేషన్ ఆరోపించినది. బీఎస్ఎన్ఎల్, ఇంకా డాట్ పెన్షనర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు డి.శంకర్, సర్కిల్ కార్యదర్శులు రామచంద్రుడు, కే. కరుణ ప్రసాద్, సంచార్ నిగమ్ పెన్షనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సర్కిల్ సెక్రెటరీ గోలి రమేష్లు ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. తక్షణమే సవరణ చేయకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేపడుతామని వారు హెచ్చరించారు. ఈ మేరకు సోమవారం కవాడిగూడలోని సీసీఏ (పెన్షన్) కార్యాలయం జాయింట్ ఫోరం ఆఫ్ పెన్షనర్స్ అసోసియేషన్ తెలంగాణ సర్కిల్ ఆధ్వర్యంలో ‘పెన్షన్ సవరణ చేయాలని’ డిమాండ్ చేస్తూ వందలాది మంది పెన్షనర్లు పెద్ద ఎత్తున హాజరై మాస్ ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. “పెన్షన్ సవరణ భిక్ష కాదు – హక్కు’ అని ఎలిగెత్తి చాటుదాం, పెన్షన్ సవరణ సాధించుకుందాం” అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సంఘాల ప్రతినిధులు పొట్లకాయల వెంకటేశ్ ముదిరాజ్, జగన్ మోహన్ రెడ్డి, శాస్త్రి, కర్ణ అనిల్, మోహన్ రావు, ఎండీ రఫీఖ్, టి.సుధాకర్, సయ్యద్ హుస్సేన్, పోల్రాజు, ఎన్ఎస్ఎన్ మూర్తి, టి.శేషయ్య, రంగయ్య, వీరస్వామి పాల్గొన్నారు.