Jubilee Hills | బంజారాహిల్స్/వెంగళరావునగర్ మార్చి 13: ‘సీఐకి ఫోన్ చేసుకుంటావో.. ఎమ్మెల్యేకు ఫోన్ చేసుకుంటావో చేసుకో.. ఇది మా ప్రభుత్వం.. ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకో’..అంటూ.. బీఆర్ఎస్ మహిళా కార్పొరేటర్పై అమానుషంగా దాడి పాల్పడ్డారు కాంగ్రెస్ నాయకులు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మరోసారి కాంగ్రెస్ మార్క్ రౌడీ రాజకీయం వెలుగులోకి వచ్చింది. పదిరోజుల కిందట బీఆర్ఎస్ కార్యకర్తలను కిడ్నాప్ చేసి విచక్షణారహితంగా దాడి చేసిన ఘటన మరువకముందే ఏకంగా ఈసారి పార్టీకి చెందిన మహిళా కార్పొరేటర్పై కాంగ్రెస్ కార్యకర్తలు పక్కా ప్రణాళికతో దాడికి పాల్పడటం కలకలం రేపింది. యూసుఫ్గూడ, వెంగళరావునగర్ డివిజన్ల పరిధిలో ప్రధాన రహదారులతో పాటు పలు ప్రాంతాల్లో రెండునెలలుగా కాంగ్రెస్ నాయకులు నవీన్యాదవ్, వెంకట్యాదవ్ ఇష్టారాజ్యంగా పెద్దపెద్ద ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు.
నెలల తరబడి ఫ్లెక్సీలు పెట్టడంతో రాకపోకలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని, గతంలో ఫ్లెక్సీలు పెడితే రెండుమూడు రోజుల్లోనే తొలగించే జీహెచ్ఎంసీ సిబ్బంది నిర్లక్ష్యంగా వహిస్తున్నారంటూ.. స్థానికులు వెంగళరావునగర్ కార్పొరేటర్ దేదీప్యకు ఫిర్యాదు చేశారు. దీంతో మంగళవారం కార్పొరేటర్ దేదీప్య జీహెచ్ఎంసీ అధికారులకు ఫిర్యాదు చేశారు. స్థానికులకు ఇబ్బందులు కలిగించేలా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను తొలగించేందుకు సిబ్బంది యూసుఫ్గూడ చెక్పోస్ ్టవద్దకు వచ్చారు. కాగా, ఫ్లెక్సీలు తొలగించనున్నారన్న సమాచారంతో కాంగ్రెస్ నాయకులు నవీన్ యాదవ్ సోదరుడు వెంకట్యాదవ్తో పాటు పలువురు మహిళలు అక్కడికి చేరుకుని వారితో వాగ్వాదానికి దిగారు.
తమకు స్థానిక కార్పొరేటర్ దేదీప్య ఫిర్యాదు చేయడంతో ఫ్లెక్సీలు తొలగించేందుకు వచ్చామంటూ డీఆర్ఎఫ్ సిబ్బంది చెప్పడంతో పాటు ఆమెకు ఫోన్ చేసి వెంటనే అక్కడకు రావాలని కోరారు. కాసేపటి తర్వాత భర్త విజయ్, పీఏ ఫయీమ్తో కలిసి కారులో దేదీప్య అక్కడకు చేరుకున్నారు. ముందుగా వేసుకున్న ప్రణాళిక ప్రకారం అప్పటికే సుమారు 30 నుంచి 40 మంది మహిళలు కారును అడ్డుకోవడంతో పాటు తీవ్ర పదజాలంతో దూషించడం ప్రారంభించారు. దీంతో కార్పొరేటర్ దేదీప్యకు, కాంగ్రెస్ మహిళా కార్యకర్తలకు వాగ్వాదం ప్రారంభమైంది. సమస్య గురించి మాట్లాడుతుండగానే భావన, నాగలక్ష్మి, లక్ష్మి తదితర మహిళలు కారులో ఉన్న కార్పొరేటర్ దేదీప్యపై దాడికి దిగారు.
అంతటితో ఆగకుండా ఆమెను కారులోంచి బయటకు లాగేందుకు ప్రయత్నించడంతో పాటు ముందుకు వెళ్లకుండా అడ్డుకున్నారు. ‘సీఐకి ఫోన్ చేసుకుంటావో.. ఎమ్మెల్యేకు ఫోన్ చేసుకుంటావో చేసుకో.. ’ అంటూ తీవ్రస్థాయిలో బూతులు తిట్టారు. ఫోన్ లాక్కుని పారవేశారు. అక్కడే ఉన్న కాంగ్రెస్ నేత వెంకట్యాదవ్తో పాటు అతడి అనుచరులు దాడి ఘటనను వీడియోలు తీయడంతో పాటు వాటిని సోషల్ మీడియాలో వైరల్ చేశారు. సుమారు 20 నిమిషాల పాటు కారును ముందుకు వెళ్లకుండా దాడికి పాల్పడటంతో కార్పొరేటర్ దేదీప్యకు తీవ్ర గాయాలయ్యాయి. జరిగిన సంఘటనపై జూబ్లీహిల్స్ పోలీసులకు దేదీప్య భర్త విజయ్ జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేయగా, పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఇదిలా ఉండగా పక్కా ప్రణాళికతో కార్పొరేటర్ దేదీప్యరావుపై దాడి చేసిన మహిళలు జూబ్లీహిల్స్ పోలీస్స్టేషన్కు వెళ్లి తమ మీదనే కార్పొరేటర్ దాడి చేశారని, అసభ్యంగా మాట్లాడారని ఫిర్యాదు చేశారు. తాము కేవలం మాట్లాడుతుండగా తమపై దాడి చేశారని, తోసేశారంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో దాడికి గురైన కార్పొరేటర్తో పాటు ఆమె భర్త విజయ్, పీఏ ఫయీమ్లపై జూబ్లీహిల్స్ పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. తమ మీదనే దాడి జరిగినా.. తమపైనే కేసు పెట్టడం ఏమిటని కార్పొరేటర్ దేదీప్యరావు ఆవేదన వ్యక్తం చేశారు. కాగా, కార్పొరేటర్ దేదీప్యరావును ఎమ్మెల్యే మాగంట గోపీనాథ్, కార్పొరేటర్లు వనం సంగీత శ్రీనివాస్ యాదవ్, మన్నె కవిత పరామర్శించారు.